శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By chj
Last Modified: బుధవారం, 11 అక్టోబరు 2017 (21:29 IST)

8 జాతీయ, అంతర్జాతీయ స్కూళ్లకు 32 ఎకరాలు... మంత్రి నారాయణ

అమరావతి : అమరావతిలో కొత్తగా ఏర్పాటు చేయనున్న 8 జాతీయ, అంతర్జాతీయ పాఠశాలలకు రాష్ట్ర ప్రభుత్వం 32 ఎకరాలు కేటాయించినట్లు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పి.నారాయణ తెలిపారు. సచివాలయంలోని పబ్లిసిటీ సెల్‌లో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడా

అమరావతి : అమరావతిలో కొత్తగా ఏర్పాటు చేయనున్న 8 జాతీయ, అంతర్జాతీయ పాఠశాలలకు రాష్ట్ర ప్రభుత్వం 32 ఎకరాలు కేటాయించినట్లు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పి.నారాయణ తెలిపారు. సచివాలయంలోని పబ్లిసిటీ సెల్‌లో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడారు. సీఎం చంద్రబాబునాయుడు అధ్యక్షతన సీఆర్డీయే అథారిటీ సమావేశం బుధవారం జరిగినట్లు మంత్రి తెలిపారు. 
 
ఈ సమావేశంలో అమరావతిలో ఏర్పాటు చేయబోతున్న 8 జాతీయ, అంతర్జాతీయ పాఠశాలలకు భూముల కేటాయింపునకు నిర్ణయం తీసుకున్నామన్నారు. స్కాటీస్ హైస్కూల్‌కు 4 ఎకరాలు, చిన్మయ మిషన్ స్కూల్‌కు 3, ది హెరిటేజ్ స్కూల్‌కు 2 ఎకరాలు, రాయింగ్ గ్లోబల్ స్కూల్‌కు 4, పోదార్ స్కూల్‌కు 3, గండేల్ అకాడమీకి 8 ఎకరాలు, జీఏఎఎస్‌కు 4 ఎకరాల చొప్పున 32 ఎకరాలు కేటాయించినట్లు మంత్రి నారాయణ తెలిపారు. 8 ఎకరాలు కేటాయించిన గండేల్ అకాడమీలో బోర్డింగ్ సౌకర్యం ఉంటుందన్నారు. మిగిలిన స్కూళ్లన్నీ డే స్కాలర్స్ అని తెలిపారు. నిబంధనల ప్రకారం ఈ భూములు కేటాయించామన్నారు.
 
ఎమ్మెల్యే, ఉద్యోగుల ఇళ్ల నిర్మాణాలపై ప్రజాభిప్రాయ సేకరణ
అమరావతిలో నిర్మించతలపెట్టిన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, గెజిటెడ్, నాన్ గెజిటెడ్, నాలుగో తరగతి ఉద్యోగుల ఇళ్ల నిర్మాణాల నమూనాలను పబ్లిక్ డొమైన్‌లో పెట్టి, ప్రజాభిప్రాయం సేకరించనున్నట్లు రాష్ట్ర పురపాలక మంత్రి పి.నారాయణ తెలిపారు. మంగళవారం జరిగిన రాష్ట్ర మంత్రిమండలి సమావేశంలో ఆర్కాబ్ సంస్థ రూపొందించిన 10 డిజైన్లను పరిశీలించామన్నారు. ఆ డిజైన్లపై ప్రజాభిప్రాయం కూడా సేకరించాలని సీఎం చంద్రబాబునాయుడు ఆదేశించారన్నారు. 
 
ప్రజాభిప్రాయం ద్వారా ఎంపికైన నమూనా ఆధారంగా ఈపీసీ పద్ధతిలో ప్లాట్ల నిర్మాణాలు చేపడతామన్నారు. ప్లాట్ల నిర్మాణాలకు సంబంధించిన టెండర్లకు సీఆర్డీఏ అథార్టీ సమావేశం ఆమోదం తెలిపిందన్నారు. టైప్ 1 లో 384 అపార్టుమెంట్లు, టైప్ 2లో 336, క్లాస్ 4లో 720... ఇలా మొత్తం 21 టవర్లలో 1,430 అపార్టుమెంట్లు నిర్మాణం చేపడుతున్నామన్నారు. 
ఒక్కో టవర్‌లో జీ+12లో ఈ అపార్టుమెంట్లు నిర్మిస్తున్నామన్నారు. ఈ టవర్లను 27 లక్షల 24 వేల 80 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మాణం చేపడుతున్నామన్నారు. నాన్ గెజిటెడ్ అధికారులకు సంబంధించి, 1.928 అపార్టుమెంట్లను 22 టవర్లలో 35 లక్షల 63 వేల 640 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మిస్తున్నామన్నారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు 300 అపార్టుమెంట్లు, ఐఏఎస్ అధికారులకు 130 అపార్టుమెంట్లను 18 టవర్లలో 21 లక్షల 69 వేల 358 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మిస్తున్నామన్నారు. 
 
మొత్తం 3,820 అపార్టుమెంట్లను 61 టవర్లలో 84 లక్షల 57 వేల 78 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మాణం చేపడతామన్నారు. ఈ నిర్మాణాలకు సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన సీఆర్డీఏ అథార్టీ ఆమోదం తెలిపిందన్నారు. అమరావతి డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన రోడ్ల నిర్మాణాలకు సంబంధించిన 14 టెండర్లకు అథార్టీ ఆమోదం తెలిపిందన్నారు.
 
అసెంబ్లీ, హైకోర్టు, సెక్రటేరియట్ భవనాల డిజైన్ల ఖరారుకు లండన్ పయనం...
అసెంబ్లీ, హైకోర్టు, సెక్రటేరియట్ భవనాల డిజైన్ల ఫైనలేజ్ చేయడానికి లండన్ వెలుతున్నట్లు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పి.నారాయణ తెలిపారు. వాటితో పాటు సీఎం, గవర్నర్ బంగ్లా భవనాల డిజైన్లకు కూడా ఖరారు చేయాల్సి ఉందన్నారు. సీఎం, గవర్నర్ బంగ్లాల డిజైన్లు ప్రస్తుతం జరుగుతున్నాయన్నారు. అసెంబ్లీ, హైకోర్టు, సెక్రటేరియట్ భవనాలను లండన్‌కు చెందిన నార్మన్ ఫోస్టర్స్ డిజైన్ చేస్తోందన్నారు. 
 
ఈ నెల 12, 13, 14 తేదీల్లో మూడ్రోజుల పాటు అధికారుల బృందంతో కలిసి తాను కూడా లండన్ వెలుతున్నట్లు మంత్రి తెలిపారు. నార్మన్ ఫోస్టర్స్ ప్రతినిధులు రూపొందించిన డిజైన్లను పరిశీలించి మార్పులు చేర్పుల కోసం సలహాలిస్తామన్నారు. ఈ నెల 25న సీఎం చంద్రబాబునాయుడు కూడా లండన్ వస్తున్నారని, నార్మన్ ఫోస్టర్స్ రూపొందించిన అసెంబ్లీ, హైకోర్టు, సెక్రటేరియట్ భవనాల డిజైన్లను పరిశీలిస్తారన్నారు. సంతృప్తి చెందితే అక్కడికక్కడే సీఎం చంద్రబాబు ఫైనలేజ్ చేస్తారన్నారు. ఏవైనా మార్పులు చేర్పులుంటే వచ్చే  నెల మొదటివారంలో అసెంబ్లీ, హైకోర్టు, సెక్రటేరియట్ భవనాల డిజైన్లను ఖరారు చేసి, టెండర్లు పిలుస్తామని మంత్రి తెలిపారు.