శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By chj
Last Modified: శుక్రవారం, 23 ఫిబ్రవరి 2018 (22:27 IST)

సిటీ కోర్టు, ఐటీ టవర్ డిజైన్లు రెడీ... పరిశీలించిన సీఎం చంద్రబాబు(ఫోటోలు)

అమరావతి: సిటీ కోర్టు, ఐటీ టవర్ భవనాల డిజైన్లను రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేసింది. ఇప్పటికే ప్రజాభిప్రాయసేకరణకు ఆన్‌లైన్‌లో పెట్టింది. అత్యధికుల ఎంపిక చేసిన డిజైన్లను ఓకే చేసి, టెండర్లు పిలిచి నిర్మాణం చేపట్టాలని సీఆర్డీఏ అధికారులను సీఎం చంద్రబాబునాయుడ

అమరావతి: సిటీ కోర్టు, ఐటీ టవర్ భవనాల డిజైన్లను రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేసింది. ఇప్పటికే ప్రజాభిప్రాయసేకరణకు ఆన్‌లైన్‌లో పెట్టింది. అత్యధికుల ఎంపిక చేసిన డిజైన్లను ఓకే చేసి, టెండర్లు పిలిచి నిర్మాణం చేపట్టాలని సీఆర్డీఏ అధికారులను సీఎం చంద్రబాబునాయుడు ఆదేశించినట్లు రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పి.నారాయణ తెలిపారు. సీఆర్డీఏ పరిధిలో వెయ్యి అపార్టుమెంట్లను ప్రభుత్వమే స్వయంగా నిర్మించి, ప్రజలకు విక్రయించనుందన్నారు. సచివాలయంలోని నాలుగో బ్లాక్ పబ్లిసిటీ సెల్‌లో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 
 
సీఎం చంద్రబాబునాయుడు అధ్యక్షతన సీఆర్డీయే సమావేశం సచివాలయంలో శుక్రవారం జరిగింది. ఈ సమావేశంలో సిటీ కోర్టు నిర్మాణానికి 12 డిజైన్లు, ఐటీ టవర్ కోసం 19 డిజైన్లను ఆర్కిటెక్టర్లు రూపొందించిన వాటిని సీఎం చంద్రబాబునాయుడుకు చూపించారు. ఈ నెల 22వ తేదీన సిటీ కోర్టు, ఐటీ టవర్ డిజైన్లు ప్రజాభిప్రాయ సేకరణకు ఆన్‌లైన్లో పెట్టినట్లు సీఎంకు వివరించినట్లు మంత్రి తెలిపారు. ఇప్పటివరకూ 3 వేల మంది డిజైన్లను తిలకించారని, మరో రెండ్రోజుల పాటు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచనున్నామని ఆయన తెలిపారు. ఆ తరవాత అత్యధికుల ఎంపిక చేసిన డిజైన్లను సీఎం చంద్రబాబునాయుడు దృష్టికి తీసుకెళ్లతామన్నారు. ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన వెంటనే టెండర్లు పిలిచి నిర్మాణాలు చేపడతామని మంత్రి నారాయణ తెలిపారు.
 
రూ.372 కోట్లతో వెయ్యి అపార్టుమెంట్లు...
అమరావతి రాజధాని పరిధిలో వేగవంతంగా గృహ నిర్మాణాలు ప్రారంభం కావడానికి రాష్ట్ర ప్రభుత్వమే వెయ్యి అపార్టుమెంట్లను సొంతంగా నిర్మించనుందని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ తెలిపారు. ఈ అపార్టుమెంట్లను 2, 3 బెడ్‌రూమ్‌లుగా నిర్మాణం చేపడతామన్నారు. అవి పూర్తికాగానే, ప్రజలకు వేలం పద్ధతిలో విక్రయిస్తామన్నారు. వెయ్యి అపార్టుమెంట్ల నిర్మాణంతో అక్కడి ఆసుపత్రులు, విద్యా సంస్థలు, మార్కెట్ ఏర్పాటవుతాయన్నారు. అదే సమయంలో అక్కడ మరింతమంది నివాసం ఏర్పాటు చేసుకోడానికి ముందుకొస్తారని మంత్రి తెలిపారు. 
 
నయా రాయపూర్, గాంధీనగర్, చండీఘడ్ రాజధాని నిర్మాణ సమయంలో అక్కడి ప్రభుత్వాలు ఇటువంటి ఫార్ములానే పాటించాయన్నారు. అపార్టుమెంట్ల నిర్మాణానికి సీఎం చంద్రబాబునాయుడు అనుమతించారని, త్వరలోనే డిజైన్లు రూపొందించి, టెండర్లు పిలిచి నిర్మాణాలు చేపడతామన్నారు. ఐఏఎస్, ఐపీఎస్, నాన్ గెజిటెడ్ ఉద్యోగాల కోసం చేపట్టిన 3,840 అపార్టుమెంట్ల నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయన్నారు. 
 
2 నెలల్లో విజయవాడ కెనాల్స్ గ్రీనరీ పూర్తి చేయాలి...
విజయవాడలో ఉన్న కెనాల్స్ పక్కన చేపట్టిన గ్రీనరీని రెండు నెలల్లో పూర్తి చేయాలని సీఎం చంద్రబాబునాయుడు ఆదేశించినట్లు రాష్ట్రమున్సిపల్ శాఖ మంత్రి నారాయణ తెలిపారు. ఇప్పటికే కొన్ని కెనాల్స్ పక్కన గ్రీనరీ అభివృద్ధి చేశామని సీఎం చంద్రబాబుకు సీఆర్డీఏ అధికారులు తెలిపారన్నారు. రెండు నెలల్లో అన్నీ కెనాల్స్ పక్కన గ్రీనరీ అభివృద్ధి చేయాలని సీఎం ఆదేశించారన్నారు.
 
243 కిలో మీటర్ల డివైడర్లలో గ్రీనరీ పూర్తి...
రాష్ట్రంలోని 110 మున్సిపాల్టీల్లో 75 శాతం మేర 243 కిలోమీటర్లలో ఉన్న డివైడర్లపై మొక్కల పెంపకం పూర్తి చేసినట్లు మంత్రి నారాయణ తెలిపారు. మరో రెండు నెలల్లో మిగిలిన 25 శాతం పూర్తి చేస్తామన్నారు. విజయవాడ కార్పొరేషన్ పరిధిలో వీలైనంత త్వరగా గ్రీనరీ అభివృద్ధి చేయాలని సీఆర్డీఏ అధికారులను సీఎం చంద్రబాబునాయుడు ఆదేశించారన్నారు.
 
ఆర్టీజీ సెంటర్‌తో మున్సిపాల్టీలో కమాండ్ కంట్రోల్ సెంటర్లు అనుసంధానం...
110 మున్సిపాల్టీల్లో ఏర్పాటు చేయబోయే కమాండ్ కంట్రోల్ సెంటర్లను సచివాలయంలోని సీఎంవో కార్యాలయంలో ఉన్న ఆర్టీజీ సెంటర్ కమాండ్ కంట్రోల్ తో అనుసంధాన చేయనున్నట్లు మంత్రి నారాయణ తెలిపారు. ఇప్పటికే విశాఖపట్నంలో కమాండ్ కంట్రోల్ నిర్వహిస్తున్నామన్నారు. మున్సిపాల్టీల్లో ఏర్పాటుకానున్న కమాండ్ కంట్రోల్ సెంటర్లను సీఎంవో కార్యాలయంలో ఉన్న కమాండ్ సెంట్రల్ నుంచి దిశానిర్దేశం చేసేలా సాంకేతిక వ్యవస్థను రూపొందిస్తున్నామన్నారు.