బుధవారం, 17 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 29 జూన్ 2017 (08:56 IST)

రంజాన్‌కు ఇంటికొచ్చి.. స్నేహితుడిని రక్షించి... ప్రాణాలు కోల్పోయిన బీటెక్ యువకుడు

తన కుటుంబ సభ్యులు, స్నేహితులతో రంజాన్ పండుగను జరుపుకునేందుకు ఇంటికి వచ్చిన ఓ బీటెక్ యువకుడు.. సముద్ర స్నానానికెళ్లి ప్రమాదంలో చిక్కుకున్న తన స్నేహితుడిని కాపాడేందుకు ప్రయత్నించి మృత్యువాత పడ్డాడు.

తన కుటుంబ సభ్యులు, స్నేహితులతో రంజాన్ పండుగను జరుపుకునేందుకు ఇంటికి వచ్చిన ఓ బీటెక్ యువకుడు.. సముద్ర స్నానానికెళ్లి ప్రమాదంలో చిక్కుకున్న తన స్నేహితుడిని కాపాడేందుకు ప్రయత్నించి మృత్యువాత పడ్డాడు. గుంటూరు జిల్లాలో జరిగిన ఈ వివరాలను పరిశీలిస్తే... చిలకలూరిపేటలోని గుర్రాల చావిడి పెద్ద మసీదు సమీప ప్రాంతానికి చెందిన సయ్యద్‌ రబ్బానీ (23) నరసరావుపేట ఇంజనీరింగ్‌ కళాశాలలో గత ఏడాది మెకానికల్‌ ఇంజనీరింగ్‌ పూర్తి చేశాడు. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. 
 
రంజాన్‌ పండగకు హైదరాబాద్‌లోని స్నేహితులతో కలసి చిలకలూరిపేట వచ్చాడు. పండగ తర్వాత రోజైన మంగళవారం స్నేహితులతో కలసి ప్రకాశం జిల్లా చీరాల వాడరేవు బీచ్‌కు వెళ్లారు. సాయంత్రం స్నేహితులందరూ సముద్రస్నానం చేస్తున్న సమయంలో హైదరాబాద్‌కు చెందిన ఓ మిత్రుడు అలలో కొట్టుకుపోవడం గమనించిన రబ్బానీ అతడిని రక్షించాడు. ఆపై అలలలో చిక్కుకున్న రబ్బానీ బయటకు రాలేక సముద్రం లోపలికి కొట్టుకుపోయాడు. పోలీసులు గజ ఈతగాళ్లతో వెతికించినా ప్రయోజనం లేదు. బుధవారం ఉదయం మృతదేహం ఒడ్డుకు కొట్టుకొచ్చింది.