శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By selvi
Last Updated : శుక్రవారం, 6 ఏప్రియల్ 2018 (16:51 IST)

ఆంధ్రాపై తెలంగాణ వాసుల కోపానికి అదే కారణం.. సీమ ఉద్యమం వస్తే?: పవన్ కల్యాణ్(వీడియో)

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పాదయాత్రకు రంగం సిద్ధం చేసుకున్నారు. తెలంగాణలోనూ జనసేన పార్టీని విస్తరించే దిశగా పవన్ కల్యాణ్.. రాష్ట్రంలోని అన్ని జాతీయ రహదారులపైనా పాదయాత్రలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఈ

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పాదయాత్రకు రంగం సిద్ధం చేసుకున్నారు. తెలంగాణలోనూ జనసేన పార్టీని విస్తరించే దిశగా పవన్ కల్యాణ్.. రాష్ట్రంలోని అన్ని జాతీయ రహదారులపైనా పాదయాత్రలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు తన అభిమానులు, కార్యకర్తలకు సందేశమిచ్చారు. ఈ పాదయాత్రల్లో భాగంగా ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని నినదించాలని కోరారు. జనసేన నినాదం కేంద్రానికి వినిపించాలని పవన్ పిలుపునిచ్చారు.
 
మరోవైపు ఏపీలో జాతీయ రహదారులపై జనసేన పాదయాత్రలు చేపట్టగా, సీపీఐ, సీపీఎం పార్టీలు మద్దతు పలికాయి. ప్రత్యేక హోదా, విభజన హామీల అమలులో కేంద్రం వైఖరికి నిరసనగా ఈ యాత్రలు చేపట్టినట్టు జనసేన ప్రకటించింది.
 
మరోవైపు ఏపీ సీఎం చంద్రబాబుపై పవన్ కల్యాణ్ మండిపడ్డారు. గతంలో తాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హైదరాబాద్ విషయంలో ఏ తప్పు చేశారో, ప్రస్తుతం అమరావతి విషయంలోనూ అదే తప్పు చేస్తున్నారని పవన్ వ్యాఖ్యానించారు. ప్రభుత్వ విధానాలపై పవన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. 
 
హైదరాబాద్‌ను తానే నిర్మించానని చెప్పుకుంటున్న చంద్రబాబు, కేవలం సైబరాబాద్‌ను మాత్రమే అభివృద్ధి చేశారని గుర్తు చేశారు. ఆపై ఔటర్ రింగ్ రోడ్డుతో అభివృద్ధి కొత్త పుంతలు తొక్కగా, అంతే విధ్వంసం కూడా జరిగిందని, చిన్న రైతుల నుంచి భూమిని లక్షలకు కొన్న కొందరు బడాబాబులు కోట్లకు పడగలెత్తారని మండిపడ్డారు. 
 
దీంతో అభివృద్ధిలో తమకు భాగం లేకుండా పోయిందన్న భావన ప్రజల మనసుల్లో చేరిందని.. ఆంధ్రా ప్రజలపై తెలంగాణ వాసుల కోపానికి కారణం అదేనని, ఇప్పుడు అమరావతి విషయంలోనూ ఇదే జరుగుతోందని పవన్ ఆరోపించారు. కేవలం అమరావతిని మాత్రమే చూసుకుంటే, రాయలసీమ, కళింగ ఉద్యమాలు వస్తాయని పవన్ హెచ్చరించారు.