శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 24 ఏప్రియల్ 2018 (18:24 IST)

ప్రధానమంత్రి అభ్యర్థిని నేనే ఎంపిక చేస్తా : చంద్రబాబు

వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో 25 ఎంపీ సీట్లను గెలిపించినట్టయితే, ప్రధానమంత్రి అభ్యర్థిని తానే ఎంపిక చేస్తానని టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు.

వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో 25 ఎంపీ సీట్లను గెలిపించినట్టయితే, ప్రధానమంత్రి అభ్యర్థిని తానే ఎంపిక చేస్తానని టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. మంగళవారం తూర్పుగోదావరి జిల్లా పర్యటనకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ... మోడీ పాలనలో ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు రక్షణ లేదని, దానికి కేంద్రప్రభుత్వమే కారణమని ఆరోపించారు.
 
ఇకపోతే, కేంద్రప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలవల్లే బ్యాంకుల్లో కుంభకోణాలు జరుగుతున్నాయని విమర్శించారు. వేల కోట్ల రూపాయలు కుంభకోణం చేసిన వ్యక్తులను పీఎంవోలో పెట్టుకుంటూ... ప్రజలకు ఏం సందేశం ఇస్తున్నారని ప్రధాని మోడీని ప్రశ్నించారు. బ్యాంకులు దివాళా తీస్తున్నాయని, బ్యాంకుల్లో తప్పు చేసినవారిని కఠినంగా శిక్షించలేకపోయారని చంద్రబాబు విమర్శించారు. 
 
బ్యాంకుల్లో రుణాలు తీసుకుని, విదేశాలకు పోరిపోయిన వారి ఆస్తులు జప్తు చేస్తామని అంటున్నారని, అదే సమయంలో వేల కోట్ల రూపాయలు ప్రజా ధనాన్ని దోచుకున్నవారిపై కేంద్రం ఎందుకు నిర్లక్ష్యంగా ఉందని (జగన్‌ను ఉద్దేశించి) చంద్రబాబు ప్రశ్నించారు. ఎవరికి ప్రధాని సమాధానం చెబుతారని ఆయన నిలదీశారు. ఏడాదిలోపల మొత్తం జప్తు చేస్తామన్నారు. అవినీతిని ప్రక్షాళన చేస్తామని తెలిపారు. అలాంటి అవినీతిపరులను పక్కన పెట్టుకుని, ఎలాంటి సంకేతాలు ఇస్తున్నారని మోడీపై చంద్రబాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. 
 
దేశ ప్రజల జీవితాలతో కేంద్రం ఆడుకుంటోందని ఆయన ఆరోపించారు. ముఖ్యంగా, ఇతర రాష్ట్రాల్లో సాగించినట్టుగా రాష్ట్రంలో కూడా బీజేపీ ఆట్లాడాలని భావిస్తోందనీ, కానీ బీజేపీ ఆటలు ఏపీలో సాగవని చంద్రబాబు జోస్యం చెప్పారు. అదేసమయంలో దేశంలో ఆడబిడ్డలకు భద్రత లేదని, జమ్మూకశ్మీర్‌లో జరిగిన ఘోరం చూస్తే... ఆడబిడ్డలు ఏ విధంగా ఈ ప్రభుత్వంపై నమ్మకం పెట్టుకుంటారని ముఖ్యమంత్రి చంద్రబాబు నిలదీశారు.