శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By chitra
Last Updated : శుక్రవారం, 20 మే 2016 (12:01 IST)

కాకినాడకు 90 కిలోమీటర్ల దూరంలో 'రోను' తుఫాను

బంగాళాఖాతంలో మొదలైన "రోను'' తుఫాను కోస్తాంధ్రపై తీవ్ర ప్రభావం చూపుతోంది. దీంతో కోస్తా జిల్లాల్లో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా నెల్లూరు, గూడూరు, కావలి, నాయుడుపేట ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ నమోదవుతోంది. ప్రకాశం, కృష్ణా, ఉభయగోదావరి, విశాఖ జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీవర్షాలు కురుస్తున్నాయి. విశాఖకు 110 కి.మీ, కాకినాడకు 60 కి.మీ దూరంలో ''రోను'' తుఫాన్ ఉందని అధికారులు అంటున్నారు. తీరం వెంబడి 90 కి.మీ వేగంతో గాలులు వీస్తున్నాయి. 
 
అన్ని ఓడరేవుల్లోనూ 4వ నెంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని వాతావరణశాఖ అధికారులు హెచ్చిరించారు. ఈదురుగాలులకు చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకూలడంతో పలు ప్రాంతాల్లో కరెంట్  సరఫరా ఆగిపోయింది. రోను తుఫాను ప్రస్తుతం మచిలీపట్నానికి సమీపంలో కేంద్రీకృతమై ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇది గంటకు 6 నుంచి 8 కిలోమీటర్ల వేగంతో మెల్లగా ఒడిశా వైపు పయనిస్తున్నట్లు అధికారులు సూచిస్తున్నారు. 
 
గడిచిన 24 గంటల్లో ఏపీలోని అమలాపురంలో అత్యధికంగా 22 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. కాకినాడ 17సెంటీమీటర్లు అనకాపల్లి 14 సెంటీమీటర్లు, విశాఖలో 11 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. రోను తుఫాన్ ప్రభావంతో తెలంగాణలో వాతావరణం చల్లబడిందన్నారు వాతావరణ కేంద్రం అధికారులు అంటున్నారు. ఆకాశం మేఘావృతం అయ్యిందని మరో మూడు రోజులు ఇలాగే చల్లగా ఉంటుందని అంటున్నారు. 
 
ఖమ్మం, నల్గొండ, కరీంనగర్‌లోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. తుఫాన్ తీరం దాటిన తర్వాత.. మళ్లీ ఎండలు ఉంటాయన్నారు. రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించే వరకు ఎండలు తప్పకపోవచ్చని అధికారులు అంటున్నారు.