గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr

కుమార్తె సాక్షిగా అమ్మానాన్నకు పెళ్లి...

పదకొండేళ్ళ కుమార్తె తన తల్లిదండ్రులకు మళ్లీ పెళ్లి చేసింది. విజయవాడలో చోటుచేసుకున్న ఈ అరుదైన పెళ్లి వివరాలను పరిశీలిస్తే, విజయవాడకు చెందిన నాగరాణికి, చెన్నైకు చెందిన వెంకట రమణ అనే వ్యక్తితో గత 2006లో

పదకొండేళ్ళ కుమార్తె తన తల్లిదండ్రులకు మళ్లీ పెళ్లి చేసింది. విజయవాడలో చోటుచేసుకున్న ఈ అరుదైన పెళ్లి వివరాలను పరిశీలిస్తే, విజయవాడకు చెందిన నాగరాణికి, చెన్నైకు చెందిన వెంకట రమణ అనే వ్యక్తితో గత 2006లో పెళ్లి జరిగింది. ఆ తర్వాత వీరి దాంపత్య జీవితానికి గుర్తుగా 2007లో ఓ కుమార్తె జన్మించింది. 
 
చెన్నైలో కాపురం ఉంటున్న వీరి మధ్య కలహాలు మొదలయ్యాయి. దీంతో నాగరాణి తన కుమార్తెను తీసుకొని విజయవాడలోని తల్లిదండ్రుల వద్దకు వచ్చేసింది. 2011లో విజయవాడ ఫ్యామిలీ కోర్టులో పిటీషన్‌ దాఖలు చేసి, భర్త నుంచి విడాకులు కోరింది. పలు దఫాలుగా కేసును విచారించిన కోర్టు ఈ యేడాది జూలై 20వ తేదీన ఆ భార్యా భర్తలకు విడాకులు మంజూరు చేశారు.
 
ఆ తర్వాత ఆ దంపతుల్లో పునరాలోచన మొదలైంది. పెళ్లి విలువ తెలిసొచ్చింది. తన కుమార్తె పడుతున్న కష్టాలు చూసి చలించిపోయారు. తాము చేసిన తప్పుకు కుమార్తె కష్టపడటాన్ని చూసి తట్టుకోలేక పోయారు. పైగా, తామిద్దరం కూడా అకారణంగా విడిపోయినట్టు గుర్తించారు. దీంతో వారిద్దరూ శుక్రవారం తిరిగి కోర్టును ఆశ్రయించారు. 
 
'మేం మళ్లీ కలిసి జీవిస్తాం' అని ఫ్యామిలీ కోర్టును తెలిపారు. వారిద్దరి నిర్ణయాన్ని స్వాగతించిన న్యాయమూర్తి అచ్యుత పార్థసారథిని 11 యేళ్ల కుమార్తె సాక్షిగా వారిద్దరి మళ్లీ పెళ్లి జరిపించారు. అంటే పూలదండలు మార్పించారు. దీంతో ఆ దంపతుల కథ సుఖాంతమైంది.