శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. బడ్జెట్ 2016-17
Written By pnr
Last Updated : సోమవారం, 29 ఫిబ్రవరి 2016 (12:31 IST)

కొత్త ఉద్యోగులకు ఈపీఎఫ్ ప్రభుత్వమే చెల్లిస్తుందట.. కొత్తగా కోటి మందికి ఉద్యోగాలు: అరుణ్ జైట్లీ

పరిశుభ్రతకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధిక ప్రాధాన్యత ఇస్తుంటారు. ఇందుకోసమే ఆయన ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత స్వచ్ఛ భారత్ పథకానికి శ్రీకారం చుట్టి, దాన్ని సమర్థవంతంగా అమలు చేస్తున్నారు. సోమవారం లోక్‌సభలో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ 2016-17 సంవత్సరానికి గాను వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఆయన ప్రసంగంలో కూడా వ్యక్తిగత పరిశుభ్రత, స్వచ్ఛభారత్‌కు పెద్ద పీట వేశారు. ఇందులోభాగంగా, బహిరంగ ప్రదేశాల్లో మల విసర్జనను నిర్మూలించే గ్రామాలకు పురస్కరాలు అందజేస్తామని ప్రకటించారు. అలాగే, ఆయన ప్రసంగంలోని కీలకాంశాలను పరిశీలిస్తే... వచ్చే మూడేళ్ళలో కోటి మందికి ఉద్యోగాలు కల్పిస్తామని ఆయన ప్రకటించారు. 
 
అలాగే, కొత్త ఉద్యోగులకు మొదటి మూడేళ్లు 8.33 శాతం ఈపీఎఫ్‌ను పెన్షన్ స్కీమ్ కింద ప్రభుత్వమే చెల్లిస్తుందని పేర్కొన్నారు. స్టార్టప్‌ ఇండియా స్టాండప్‌ ఇండియా కోసం రూ.500 కోట్లు కేటాయించారు. పంచాయతీలు, పురపాలక సంఘాల ఆర్థిక సాయం కోసం రూ.2.87లక్షల కోట్ల గ్రాంటును మంజూరు చేశారు. ఇకపోతే.. భూగర్భ జలాల పెంపునకు రూ.60 వేల కోట్లు, గ్రామీణాభివృద్ధికి రూ.87,765 కోట్లు, ఉపాధిహామీ పథకానికి గతేడాది కంటే రూ.4 వేల కోట్లు అదనంగా మొత్తం రూ.38,500 కోట్లు కేటాయింపులు జరిపినట్టు తన ప్రసంగంలో పేర్కొన్నారు. 
 
వయో వృద్ధులకు రూ.30 వేలు అదనంగా ఆరోగ్య బీమా, కుటుంబానికి రూ.లక్ష మేర బీమా సౌకర్యం కల్పిస్తామని తెలిపారు. మే 2018నాటికి కరెంటులేని 18,500 గ్రామాలకు విద్యుత్‌ వెలుగులు అందిస్తామన్నారు. గ్రామాల్లోనూ డిజిటల్‌ అక్షరాస్యత పెంపునకు చర్యలు, దేశ వ్యాప్తంగా కొత్తగా 62 నవోదయ విద్యాలయాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు.
 
దళితుల్లో ఔత్సాహిక పారిశ్రామికవేత్తల ప్రోత్సాహానికి ప్రత్యేక విభాగం ఏర్పాటు చేస్తామనీ, అంబేద్కర్‌ 125వ జయంతికి నివాళిగా ఎస్సీ, ఎస్టీల ఆర్థిక స్థితిగతుల పెంపునకు కృషి చేస్తామన్నారు. ప్రధానమంత్రి కౌశల్‌ వికాస్‌ యోజన ద్వారా యువత నైపుణ్యాభివృద్ధికి రూ.1700 కోట్లు కేటాయించారు.  బహుముఖ నైపుణ్యాల శిక్షణకు దేశవ్యాప్తంగా 5700 పాఠశాలల ఏర్పాటు చేస్తామని తెలిపారు.