శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. కెరీర్
  3. కెరీర్ వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 14 ఫిబ్రవరి 2018 (18:17 IST)

ఎస్ఆర్ఎంలో మెటీరియల్ కెమిస్ట్రీపై అంతర్జాతీయ సదస్సు

చెన్నై నగరంలో ఉన్న ప్రముఖ విద్యా సంస్థల్లో ఒకటైన ఎస్ఆర్ఎం విశ్వవిద్యాలయంలో మెటీరియల్ కెమిస్ట్రీపై అంతర్జాతీయ సదస్సు బుధవారం ప్రారంభమైంది. ఇందులో మెటీరియల్ కెమిస్ట్రీలో ఇటీవలి కాలంలో జరిగిన తాజా పరిశోధ

చెన్నై నగరంలో ఉన్న ప్రముఖ విద్యా సంస్థల్లో ఒకటైన ఎస్ఆర్ఎం విశ్వవిద్యాలయంలో మెటీరియల్ కెమిస్ట్రీపై అంతర్జాతీయ సదస్సు బుధవారం ప్రారంభమైంది. ఇందులో మెటీరియల్ కెమిస్ట్రీలో ఇటీవలి కాలంలో జరిగిన తాజా పరిశోధనా ఫలితాల్లో అంతర్జాతీయ సమాజానికి ఉపయోగపడే అంశాలను వెల్లడించనున్నారు. మూడు రోజులపాటు సాగే ఈ సదస్సులో ఏడు దేశాలకు చెందిన పలువురు ప్రముఖులు పాల్గొని తమ అభిప్రాయలను వెల్లడించనున్నారు. 
 
ఈ సదస్సును ఎస్ఆర్ఎం ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (ఎస్ఆర్ఎంఐఎస్‌టి)లోని కెమిస్ట్రీ విభాగం నిర్వహిస్తోంది. ఈ తరహా సదస్సు నిర్వహించడం ఇది రెండోసారి. రీసెంట్ అడ్వాన్సెస్ ఇన్ మెటీరియల్ కెమిస్ట్రీ (ఐసీఆర్ఏఎంసీ 2018) పేరుతో ఈ సదస్సు 14 నుంచి 16వ తేదీ వరకు జరుగనుంది. ఈ సదస్సులో ఫ్రాన్స్‌కు చెందిన ఆల్టర్నేటివ్ ఎనర్జీస్ అండ్ అటామిక్ ఎనర్జీ కమిషన్ (సీఈఏ), భారత్‌కు చెందిన ఐఆర్‌డి కూడా పాలుపంచుకుంటున్నాయి.
 
ఈ అంతర్జాతీయ సదస్సు ప్రారంభోత్సవ కార్యక్రమం నగర శివారు ప్రాంతమైన కాట్టాన్‌కుళత్తూరులోని ఎస్ఆర్‌ఎం విశ్వవిద్యాలయంలోని డాక్టర్ టీపీ గణేశన్ ఆడిటోరియంలో బుధవారం ఉదయం జరిగింది. ఇందులో ముఖ్యఅతిథిగా నాక్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఛైర్మన్, పద్మశ్రీ ప్రొఫెసర్ వీరేంద్ర సింగ్ చౌహాన్‌తో కలిసి ఎస్ఆర్ఎం ఫౌండర్ ఛాన్సెలర్ డాక్టర్ టీఆర్.పారివేందర్, డీన్ డాక్టర్ డి.జాన్ తిరువడిగల్, ఐసీఆర్ఏఎంసీ 2018 కన్వీనర్ డాక్టర్ ఎం.అర్థనారీశ్వరి, పలు దేశాలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు.
 
ఈ సందర్భంగా డాక్టర్ పారివేందర్ మాట్లాడుతూ, ఈ తరహా వేదికలు అత్యద్భుతమైన సమాచారాన్ని పంచుకునేందుకు ఎంతగానో దోహదపడతాయని పేర్కొంటూ, ఈ సదస్సు విజయవంతం కావాలని ఆయన ఆకాంక్షించారు. అలాగే, ఈ తరహా సదస్సులను తరచుగా నిర్వహించాలని ఆయన రసాయన శాస్త్ర విభాగానికి సూచించారు. రోజువారీ జీవనంలో రసాయన శాస్త్రం అత్యంత కీలక భూమికను పోషిస్తోందన్నారు. కెమిస్ట్రీలో నోబెల్ బహుమతి గ్రహీత ఆల్ఫ్రెడ్ నోబెల్ చేసిన పరిశోధనలను ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు.
 
కాగా, మూడు రోజుల పాటు సాగే ఈ అంతర్జాతీయ సదస్సులో మొత్తం 12 టెక్నికల్ సెషన్స్ జరుగనున్నాయి. ఒక్కో టెక్నికల్ సెషన్‌లో వివిధ దేశాలకు చెందిన ప్రొఫెసర్లు, నిపుణులు వివిధ అంశాలపై ప్రసంగించనున్నారు. కాగా, ఈ సదస్సు విజయవంతం కావాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడులు ఆకాంక్షిస్తూ తమ సందేశాన్ని పంపించారు.