గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. చెన్నై వార్తలు
Written By Raju
Last Modified: హైదరాబాద్ , శుక్రవారం, 23 జూన్ 2017 (06:21 IST)

కోర్టు ముందు కుప్పిగంతులు కాదు.. ‘కొడనాడు’ నిందితుల కట్టుకథలు.. నివ్వెరపోయిన జడ్జీలు

జయలలిత ఎస్టేట్‌లో డేరింగ్ దొంగతనానికి పాల్పడి వందలకోట్ల విలువైన నగదు, దస్తావేజులు కొల్లగొట్టిన 11 మంది దుండుగులు కోర్టుముందే సరికొత్త డ్రామా ఆడి బెయిల్ ఇవ్వాలని కోరడం షాక్ కలిగిస్తోంది.

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితకు చెందిన కొడనాడు ఎస్టేట్‌లో దోపిడీకి పాల్పడి, వాచ్‌మెన్‌ను హత్యచేసిన నిందితుల వైఖరి ‘‘తాటి చెట్టు ఎందుకు ఎక్కావురా అంటే దూడ మేత కోసం’’ అన్నట్లుగానే ఉంది. జయలలిత ఎస్టేట్‌లో డేరింగ్ దొంగతనానికి పాల్పడి వందలకోట్ల విలువైన నగదు, దస్తావేజులు కొల్లగొట్టిన 11 మంది దుండుగులు కోర్టుముందే సరికొత్త డ్రామా ఆడి బెయిల్ ఇవ్వాలని కోరడం షాక్ కలిగిస్తోంది. 
 
‘‘అమ్మ ఆత్మను చూసి, భక్తి ప్రపత్తులతో శాంతి పూజలు చేసేందుకే అక్కడికి వెళ్లాం తప్ప మేం ఎలాంటి దోపిడీలు, హత్యలు చేయలేదు. మాకు బెయిల్‌ ఇవ్వండి’’ అని వారు కోర్టును అభ్యర్థించారు. గత ఏప్రిల్‌ 24వ తేదీ రాత్రి జయ మాజీ కారు డ్రైవర్‌ కనకరాజ్‌ నేతృత్వంలో 11మంది దుండగులు.. కొడనాడు ఎస్టేట్‌లో చొరబడి వాచ్‌;మెన్‌ ఓంబహదూర్‌ను హత్య చేసి, దోపిడీలకు పాల్పడిన విషయం తెలిసిందే. ఈ కేసులో ప్రధాన నిందితుడు కనకరాజ్‌ సేలం సమీపంలో జరిగిన కారు ప్రమాదంలో మృతి చెందాడు. మిగిలిన పదిమందిని పోలీసులు అరెస్టు చేశారు. 
 
వీరిలో కేరళకు చెందిన తాంత్రికుడు సంతోషసామి, జితన్‌జాయ్‌, మనోజ్‌సామి, షంషీర్‌ అలీ బెయిలు కోరుతూ ఊటీలోని జిల్లా కోర్టులో పిటిషన్‌లు దాఖలు చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ న్యాయవాది వారికి బెయిలు ఇవ్వకూడదని వాదించారు.

ఇక నిందితుల తరఫు న్యాయవాదులు కొడనాడు ఎస్టేట్‌లో జరిగిన వాచ్‌మెన్‌ హత్యకు, దోపిడీలకు ఈ నలుగురికి ఎలాంటి సంబంధం లేదని.. ఆ ఎస్టేట్‌లో జయ ఆత్మ సంచరిస్తున్నట్లు సమాచారం అందటంతో శాంతి పూజల కోసమే వెళ్లారని చెప్పారు. అందువల్ల వారికి బెయిలు మంజూరు చేయాలని వాదించి న్యాయమూర్తితో పాటు అందరినీ ఆశ్చర్యపోయేలా చేశారు. 
 
అయితే కట్టుకథలు మాని సక్రమంగా వాదనలు వినిపించాలని హెచ్చరిస్తూ న్యాయమూర్తి నిందితుల బెయిల్‌ అభ్యర్థన పిటిషన్‌ను తోసిపుచ్చారు.