శుక్రవారం, 29 మార్చి 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 14 ఆగస్టు 2017 (15:49 IST)

చరిత్ర సృష్టించిన భారత్.. 85 యేళ్ల టెస్ట్ హిస్టరీలో... హేమాహేమీలకు సాధ్యంకానిది...

కెప్టెన్ విరాట్ కోహ్లీ సారథ్యంలోని భారత క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించింది. 85 యేళ్ళ టెస్ట్ క్రికెట్ చరిత్రలో టీమిండియా పరాయి గడ్డపై టెస్ట్ సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసింది. ఫలితంగా కోహ్లీ సేన టెస్ట్ క

కెప్టెన్ విరాట్ కోహ్లీ సారథ్యంలోని భారత క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించింది. 85 యేళ్ళ టెస్ట్ క్రికెట్ చరిత్రలో టీమిండియా పరాయి గడ్డపై టెస్ట్ సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసింది. ఫలితంగా కోహ్లీ సేన టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఓ పేజీని సువర్ణాక్షరాలతో లిఖించింది.
 
ప్రస్తుతం శ్రీలంకలో పర్యటిస్తున్న భారత జట్టు వరుసగా మూడు టెస్ట్ మ్యాచ్‌లలో గెలుపొందింది. చివరి టెస్టులోనూ ఇన్నింగ్స్ 171 ప‌రుగుల తేడాతో శ్రీలంక‌ను చిత్తు చేసింది. 85 ఏళ్ల టెస్టు చ‌రిత్ర‌లో విదేశాల్లో భార‌త్ తొలిసారి టెస్టు సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసినందుకు టీమిండియా అభిమానులు సంబరాలు జరుపుకుంటున్నారు. 
 
రెండో ఇన్నింగ్స్ ఫాలో‌ఆన్ ఆడిన శ్రీలంక ఆదివారం రెండు వికెట్లు కోల్పోయింది. సోమవారం 19/2తో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన శ్రీలంక జట్టు భారత్ బౌలర్లు అశ్విన్ (4 వికెట్లు), మహ్మద్ షమీ (3 వికెట్లు) ధాటికి ఎక్కువ సేపు క్రీజులో నిల‌వ‌లేక‌పోయారు. కేవ‌లం 181 పరుగులకే ఆలౌట్ అయ్యారు. 
 
అదేసమయంలో భారత్ తన తొలి ఇన్నింగ్స్‌లో 487 పరుగులు చేసిన విష‌యం తెలిసిందే. శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 135 పరుగులకే ఆలౌటైంది. భార‌త బౌల‌ర్ల‌లో అశ్విన్ 4, ష‌మీ 3, ఉమేశ్‌ యాదవ్ 2, కుల్‌దీప్ యాద‌వ్ 1 వికెట్లు ప‌డ‌గొట్టారు. భారత జట్టులో ఓపెనర్లు ధవాన్ 119, రాహుల్ 85, టెయిల్ ఎండ్ బ్యాట్స్‌మెన్ హార్దిక్ పాండ్యా 108 చొప్పున పరుగులు చేసి రాణించిన విషయం తెల్సిందే. 
 
కాగా, గత నెల 26న గాలెలో జరిగిన తొలి టెస్ట్‌లో 304 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన టీమిండియా ఆగస్టు 3న ప్రారంభమైన రెండో టెస్ట్‌ను ఇన్నింగ్స్ 53 పరుగులతో గెలుచుకుంది. తాజాగా సోమవారం ముగిసిన చివరిదైన మూడో టెస్ట్‌లో ఇన్నింగ్స్ 171 పరుగుల భారీ తేడాతో విజయం సాధించి రికార్డు సృష్టించింది. ఈ రికార్డు అలాంటి ఇలాంటిది కాదు. 
 
85 ఏళ్ల భారత టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఇప్పటివరకు సాధ్యంకాని దానిని కోహ్లీ చేసి చూపించాడు. విదేశీ గడ్డపై సిరీస్‌ను నెగ్గడమే కాక ఆతిథ్య జట్టును వైట్‌వాష్ చేసిన ఘనత సాధించాడు. భారత జట్టుకు సారథ్యం వహించిన హేమాహేమీలనదగ్గ ఆటగాళ్లకు సాధ్యం కానీ రికార్డును కోహ్లీ అందుకుని తానేంటో మరోమారు నిరూపించాడు. కాగా, శ్రీలంకతో ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా తొలి వన్డే ఈనెల 20న దంబుల్లాలో జరగనుంది.