శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By pnr
Last Updated : సోమవారం, 26 జూన్ 2017 (15:38 IST)

ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా తెలుగు బిడ్డ.. ఎవరు?

భారత ఉపరాష్ట్రపతికి తెలంగాణ ప్రాంతానికి చెందిన తెలుగు బిడ్డ పేరును ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పరిశీలిస్తున్నట్టు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఉపరాష్ట్రపతిగా హమీద్ అన్సారీ కొనసాగుతున్నా

భారత ఉపరాష్ట్రపతికి తెలంగాణ ప్రాంతానికి చెందిన తెలుగు బిడ్డ పేరును ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పరిశీలిస్తున్నట్టు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఉపరాష్ట్రపతిగా హమీద్ అన్సారీ కొనసాగుతున్నారు. ఈయన పదవీ కాలం ఆగస్టు 11వ తేదీతో ముగియనుంది. దీంతో తదుపరి ఉపరాష్ట్రపతిగా ఎన్డీయే కూటమి తరపున మహారాష్ట్ర గవర్నర్‌గా ఉన్న చెన్నమనేని విద్యాసాగర్ రావు పేరును బీజేపీ పరిశీలిస్తున్నట్టు సోషల్‌ మీడియాలో ఓ వార్త వైరల్‌ అవుతోంది. 
 
కాగా, ఎన్డీయే కూటమి తరపున రాష్ట్రపతి అభ్యర్థిగా ఉత్తరాదికి చెందిన రామ్‌నాథ్‌ కోవింద్‌ను మోడీ ఎంపిక చేసిన విషయం తెల్సిందే. ఉత్తరాది వ్యక్తిని రాష్ట్రపతి పదవికి అభ్యర్థిగా ఎంపిక చేయడంతో ఉపరాష్ట్రపతి పదవిని దక్షిణాది వ్యక్తికి కట్టబెడతారని భావిస్తున్నారు. దీంతో మహారాష్ట్ర గవర్నర్‌గా ఉన్న విద్యాసాగర్‌ రావు పేరు తెరపైకి వచ్చింది. అన్ని అనుకూలిస్తే ఆయన పేరు ఖరారయ్యే అవకాశం లేకపోలేదని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. 
 
మరోవైపు.. ఈయన రెండుసార్లు 1998, 1999లో లోక్‌సభకు జరిగిన 12వ, 13వ ఎన్నికల్లో కరీంనగర్‌ ఎంపీగా గెలుపొంది కేంద్ర మంత్రివర్గంలో వాజ్‌పేయి ప్రధానిగా ఉన్నప్పుడు కేంద్ర హోంశాఖ సహాయమంత్రిగా పనిచేశారు. 2014లో ఆగస్టు 30న మహారాష్ట్ర గవర్నర్‌గా నియమితులైన విద్యాసాగర్‌ రావు అక్కడి గవర్నర్‌గా మెజార్టీ కోల్పోయిన సందర్భంలో ముఖ్యమంత్రి పృథ్విరాజ్‌ చౌహన్‌ రాజీనామాను అంగీకరించి అధ్యక్ష పాలనను విధించారు. 
 
అలాగే, తమిళనాడు గవర్నర్‌గా ఉన్న కొణిజేటి రోశయ్య 2016 ఆగస్టు 30న పదవి వీరమణ చేయగా, ఆగస్టు 31న విద్యాసాగర్‌ రావును తమిళనాడు గవర్నర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించారు. 2016 సెప్టెంబర్‌ 2 నుంచి చెన్నమనేని తమిళనాడు గవర్నర్‌గా కూడా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం ఆయన పేరును ఉపరాష్ట్రపతి పదవికి పరిశీలిస్తున్నారని ఓ వార్త వైరల్ కావడంతో పెద్ద చర్చనీయాంశంగా మారింది.