శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By ivr
Last Modified: మంగళవారం, 6 జూన్ 2017 (19:26 IST)

తెదేపా ఎమ్మెల్యేల్లో 'కట్టప్ప'లుగా కొందరు... జగన్ మోహన్ రెడ్డికి అనుకూల పవనాలు...

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు మరో రెండేళ్ల సమయం మాత్రమే వుంది. ఈ క్రమంలో అన్ని పార్టీల్లో ఎన్నికల హీట్ పెరిగిపోయింది. మరోవైపు అధికార పార్టీ సర్వేల మీద సర్వేలు చేయించుకుంటోందని సమాచారం. ఇంకోవైపు ప్రతిపక్ష పార్టీ వైకాపా కూడా తమ సర్వేల్లో మునిగితేలుతో

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు మరో రెండేళ్ల సమయం మాత్రమే వుంది. ఈ క్రమంలో అన్ని పార్టీల్లో ఎన్నికల హీట్ పెరిగిపోయింది. మరోవైపు అధికార పార్టీ సర్వేల మీద సర్వేలు చేయించుకుంటోందని సమాచారం. ఇంకోవైపు ప్రతిపక్ష పార్టీ వైకాపా కూడా తమ సర్వేల్లో మునిగితేలుతోందని చెప్పుకుంటున్నారు. ఇవన్నీ ఇలా వుంటే స్వతంత్రంగా కొన్ని సంస్థలు కూడా తమదైన సర్వేలు చేస్తున్నాయి. 
 
ఈ సర్వేల్లో వైఎస్సార్సీపి జగన్ మోహన్ రెడ్డికి అనుకూలంగా వున్నట్లు తెలుస్తోంది. దీనికి కారణం.... తెదేపా స్వయంకృతాపరాధమేనని తెలుస్తోంది. ముఖ్యంగా ఆయా నియోజకవర్గాల్లో చాలామంది ఎమ్మెల్యేలు పనితీరు సరిగా లేదనీ, వారు కట్టప్పల మాదిరిగా మారిపోయారని అంటున్నారు. ప్రజా సమస్యలను వెనువెంటనే పరిష్కరించాలన్న ధోరణి లేకపోవడంతో ప్రజల్లో వారి పట్ల విముఖత వ్యక్తమవుతోందట. 
 
మరోవైపు అమరావతి నిర్మాణం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా వుంది. మరో రెండేళ్లలో అది ఏ రూపు దాల్చుకుంటుందో చెప్పలేని పరిస్థితి. ఇదిలావుంటే గతంలో జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ తెదేపాకు వెన్నుదన్నుగా వున్నారు. ఈసారి ఆ పరిస్థితి లేదు. అలాగే భాజపా-తెదేపా మైత్రి కొనసాగుతుందో లేదో చెప్పలేని పరిస్థితి. ఈ పరిస్థితుల్లో తెదేపా ఒంటరి పోరు తప్పదు. ఇదే జరిగితే ఓట్ల చీలిక భారీగా వుంటుందనీ, అది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి లాభిస్తుందని సర్వేలు చెపుతున్నాయి. 
 
ఫలితంగా ఆ పార్టీ అధికారం చేపట్టే అవకాశం వుంటుందని అంటున్నారు. ఇక జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ అటు సినిమాలతో బిజీగా వున్నారు. ట్విట్టర్లో స్పందిస్తున్నారు కానీ ఇంకా జనంలోకి పూర్తిగా రాలేకపోతున్నారు. ఎన్నికల నాటికి అటుఇటుగా వస్తే ఆ పార్టీ బలమైన పునాదులు వేసుకోవడం కష్టమేనంటున్నారు. మహా అయితే 10 నుంచి 15 సీట్లు గెలుచుకునే అవకాశం వుంటుందని విశ్లేషిస్తున్నారు. ఎటొచ్చీ తెదేపాకు మైనస్ అయ్యే ప్రమాదం వుందని చెపుతున్నారు. మరి ఈ పరిస్థితిని తెదేపా చీఫ్ చంద్రబాబు నాయుడు తన రాజకీయ చాతుర్యంతో ఎలా నెగ్గుకొస్తారో చూడాల్సి వుంది.