గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. దీపావళి
Written By Selvi
Last Updated : మంగళవారం, 21 అక్టోబరు 2014 (17:25 IST)

దీపావళి రోజున అభ్యంగన స్నానం ఎందుకు చేయాలి?

దీపావళి రోజున అభ్యంగన స్నానం ఎందుకు చేయాలో తెలుసా అయితే ఈ స్టోరీ చదవండి. ఆధునిక పోకడలతో తలంటు, అభ్యంగన స్నానాలను పూర్తిగా మరిచిపోయారా? వారానికి శనివారం పూట నువ్వుల నూనెతో తలంటుకుని స్నానం చేస్తే కళ్లకు ఎలాంటి హాని చేకూరదని, వృద్ధాప్యంలో కంటి సమస్యలే రావని పెద్దలు చెప్తూ వుంటారు. ఇలా వారానికి ఓసారై అప్పట్లో బామ్మలు మనుమళ్లకు మనువరాళ్లకు తలంటు స్నానం తప్పనిసరిగా చేయించేవారు. 
 
ప్రస్తుతం పెద్దల నుంచి దూరంగా సిటీ లైఫ్‌కు దగ్గరగా ఉండటం ద్వారా పద్ధతులన్నీ తారుమారవుతున్నాయి. కానీ ఇలా వారానికి ఒక్కసారి కాకపోయినా సంవత్సరానికి ఒక్కసారైనా నువ్వుల నూనెతో తలంటు, అభ్యంగన స్నానం చేయండని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు.
 
అదీ దీపావళి పండుగ రోజున సూర్యోదయానికి ముందే మేల్కొని నువ్వుల నూనె తల మాడుకే కాకుండా శరీరానికి పట్టించి.. ఆయిల్ మసాజ్‌ చేయించుకుని, అరగంట లేదా 15 నిమిషాల పాటు ఆ నూనెంతా శరీరం పీల్చుకున్న తర్వాత వేడి వేడి నీటితో కుంకుడు కాయ, సున్నిపిండితో అభ్యంగన స్నానం చేయాలి. తర్వాత శుచిగా లక్ష్మీదేవి పూజ చేయాలి. 
 
ఇలా చేస్తే.. నరక బాధల నుంచి విముక్తి లభిస్తుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. అలాగే శనివారం పూట తలంటు స్నానం చేసే వారికి శనిగ్రహదోషాలు తొలగిపోతాయని, శనీశ్వర లేదా.. హనుమంతుని పూజతో నవగ్రహ ప్రభావంతో ఏర్పడే సమస్యలు తొలగిపోతాయని ఆధ్యాత్మిక నిపుణులు అంటున్నారు. 
 
ఇంతకీ దీపావళి రోజున అభ్యంగన స్నానం ఎందుకు చేయాలి?
నరక చతుర్దశినే దీపావళిగా పిలుస్తారు. ఈ రోజున కృష్ణభగవానుడు నరకాసురుడు అనే రాక్షసుడిని వధిస్తాడు. 
 
రాక్షస సంహారంతో పాటు విజయ సూచకంగా నరకాసురుడు మరణించిన రోజున తలంటు లేదా అభ్యంగన స్నానం చేయడం ఆనవాయితీ. ఇంకా నరకాసురుడు కృష్ణుడిచే వధింపబడిన రోజున ఆనందాలతో, ఉత్సాహంతో టపాకాయలను పేల్చడం చేస్తారు. 
 
ఇంకా సూర్యదయానికి ముందే నూనెతో శరీరమంతా రాసుకుని అభ్యంగన స్నానం చేయడం ద్వారా దుష్టశక్తులను, ఈతిబాధలను, దోషాలను తరిమివేసి.. కొత్త శక్తిని, దైవశక్తిని ఆహ్వానించినట్లవుతుంది. ముఖ్యంగా గంగానదీ తీరాన దీపావళి రోజున సూర్యోదయానికి ముందు చేసే అభ్యంగన స్నానం శుభఫలితాలను ఇస్తుంది.