శుక్రవారం, 29 మార్చి 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. మహాశివరాత్రి
Written By chj
Last Modified: శుక్రవారం, 4 మార్చి 2016 (12:49 IST)

పుష్పంలో గంధమూ... చంద్రునిలో వెన్నెల... సృష్టి కోసమే అర్థనారీశ్వర అవతారం...

మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఓం నమఃశివాయ... అర్థనారీశ్వర అవతారం

సృష్టి ఆరంభ వేళలో బ్రహ్మ ద్వారా రచించబడిన మానసిక సృష్టి విస్తరిల్లకపోవడంతో బ్రహ్మదేవునిలో తీవ్రమైన దుఃఖం కలిగింది. ఎటూ పాలుపోక దీర్ఘాలోచనలో పడ్డాడు. అప్పుడాయనకు ఆకాశవాణి ఇలా సెలవిచ్చింది. 'బ్రహ్మా... మైథునీ సృష్టి చేయి... అప్పుడే నీ సంకల్పం నెరవేరుతుంది...'. ఆ ఆకాశవాణి మాటలను ఆలకించి  బ్రహ్మదేవుడు మైథునీ సృష్టిని చేయ సంకల్పించ నిశ్చయించాడు. కానీ తత్సమయం వరకూ నారీ జననోత్పత్తి కాకపోవడం వల్ల అతడు తన నిశ్చయంలో సఫలుడు కాలేకపోయాడు. 
 
శివపరమేశ్వరుల కృపారహితంగా మైథునీ సృష్టి కాజాలదు. అందుకే అతడు శివదేవుని ప్రసన్నుని చేసుకోవాలని కఠోరమైన తపస్సు  చేయనారంభించాడు. చిరకాల పర్యంతం బ్రహ్మదేవుడు తన హృదయంలో ప్రేమపూర్వకంగా శివమహేశ్వర ధ్యానం చేస్తూ ఉండిపోయాడు. అతని తీవ్ర తపస్సుకు మెచ్చిన ఉమామహేశ్వరుడు అర్థనారీశ్వర రూపంలో దర్శనమిచ్చాడు. దేవాదిదేవుడైన శివభగవానుని దివ్య స్వరూపాన్ని సందర్శించిన బ్రహ్మ అభిభూతుడై  దండవత్ భూమిపై వరుండి ఆయన అలౌకిక రూపానికి ప్రణమిల్లాడు. 
 
అంత శివమహేశ్వరుడు... 'వత్సా బ్రహ్మా... నాకు నీ మనోరథం అవగతమైంది. సృష్టి వర్థిల్లాలన్న భావంతో నీవు చేసిన కఠోర తపస్సుకు నేను సంతుష్టి చెందాను. నేను నీ ఇచ్ఛను అవశ్యం నెరవేరుస్తాను...' అంటూనే శివుడు తన అర్థశరీరం నుండి ఉమాదేవిని వేరు చేశాడు. తదనంతరం శివపరమేశ్వరుని అర్థాంగం నుండి వేరైన పరాశక్తికి  బ్రహ్మదేవుడు సాష్టాంగ ప్రమాణం చేసి ఇలా పలికాడు.
 
'శివే సృష్ట్యారంభంలో నీ నాధుడూ దేవాది దేవుడు అయిన శంభు భగవానుడు నన్ను సృజించాడు. భగవతీ ఆయన ఆదేశానుసారమే దేవతాది సమస్త ప్రజల మానసిక సృష్టి చేశాను. అనేక ప్రయాసల తరువాత కూడా ఆ సృష్టిని వర్థిల్లజేయడంలో నేను అసఫలుడనయ్యాను. కనుక ఇప్పుడు స్త్రీ పురుష సమాగమం ద్వారా నేను ప్రజోత్పత్తిని చేసి సృష్టిని వర్థిల్లజేయదలిచాను. కానీ ఇంతవరకూ నారీకులం ప్రకటించబడలేదు. నారీ కులాన్ని సృష్టించడం నా శక్తికి అతీతంగా ఉంది. దేవీ నీవు సంపూర్ణ సృష్టికీ శక్తులకూ ఉద్గమస్థానానివి. హే... మాతా నీవు నాకు నారీ కుల సృష్టిని చేసే శక్తిని ప్రసాదించు. నేను మరో ప్రార్థన చేస్తున్నాను. చరాచర సృష్టి పరమార్థం నా దక్షపుత్రునికి పుత్రీరూపంలో అవతరించ నీవు దయచూపెదవు గాక' అని బ్రహ్మ అర్థించాడు.
 
బ్రహ్మ ప్రార్థనను ఆలకించిన శివానీ... తథాస్తు అని అతనికి నారీ కులాన్ని సృష్టించగలుగునట్టి శక్తిని ప్రసాదించింది. లక్ష్య సాధనకై ఆమె తన భృగుటిని మధ్యభాగం నుండి తనతో సమానమైన కాంతిమతి అయిన ఓ శక్తిని ప్రకటింపజేసింది. దానిని తిలకించిన దేవదేవేశ్వరుడైన శివుడు చిరునవ్వు నవ్వుతూ దేవీ... బ్రహ్మ తపస్సు ద్వారా నిన్ను ఆరాధించాడు. నీవాతనిపై ప్రసన్నురాలివై అతని మనోభీష్టాన్ని నెరవేర్చు అన్నాడు. పరమేశ్వరుడు ఆజ్ఞను శిరోధార్యం చేసి ఆ శక్తి బ్రహ్మ ప్రార్థనానుసారంగా దక్ష పుత్రిక అయినది. అలా బ్రహ్మకు అనుమపశక్తిని అనుగ్రహించి శివాని శివుడిలో లీనమైపోయింది. తర్వాత మహదేవుడు కూడా అంతర్థానమయ్యాడు. ఆనాటి నుండి ఈ లోకంలో మైథునీ సృష్టి కొనసాగింది. సఫల మనోరథుడైన బ్రహ్మ శివపరమేశ్వరుని స్మరించుకుంటూ నిర్వఘ్నంగా సృష్టిని విస్తరిల్లజేశాడు. 
 
అలా శివశక్తులు పరస్పరాభిన్నులై సృష్టికి ఆది కారుకులైనారు. పుష్పంలో గంధమూ, చంద్రునిలో వెన్నెలా, సూర్యునిలో ప్రభ నిత్యులై స్వభావసిద్ధులై ఉన్నట్లే శివునిలో శక్తి కూడా స్వభావ సిద్ధమై రాజిల్లుతూ ఉంటుంది. శివునిలో 'ఇ' కారమే శక్తి అయి ఉన్నది. శివుడు అజన్ముడు. ఆత్మకాగా శక్తి జగత్తులో నామరూపాల ద్వారా వ్యక్తి సత్తాగా ఉంటుంది. అర్థనారీశ్వర శివుని రహస్యమిదే.