శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 1 ఆగస్టు 2016 (11:41 IST)

యేడాదిలో 12 మంది ఎమ్మెల్యేల అరెస్టు... ఎవరిపై ఎలాంటి కేసు పెట్టారంటే..?

ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ సారథ్యంలో ఆమ్ ప్రభుత్వం ఏర్పాటైంది. ఈ ప్రభుత్వం ఏర్పాటైన ఒక యేడాదిలో 12 మంది ఎమ్మెల్యేలు అరెస్టు అయ్యారు.

ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ సారథ్యంలో ఆమ్ ప్రభుత్వం ఏర్పాటైంది. ఈ ప్రభుత్వం ఏర్పాటైన ఒక యేడాదిలో 12 మంది ఎమ్మెల్యేలు అరెస్టు అయ్యారు. తమ నేతలను కుట్ర పూరితంగా కేంద్రం అరెస్ట్ చేయిస్తోందని ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపిస్తున్నప్పటికీ, పోలీసులు అదుపులోకి తీసుకున్న వారిలో కొన్ని కేసులు చాలా తీవ్ర ఆరోపణలతో కూడినవి ఉన్నాయి. ఈ నేపథ్యంలో అరెస్టయిన 12 మంది ఆప్ ఎమ్మెల్యేలపై ఏమేని కేసులు ఉన్నాయో పరిశీలిస్తే...
 
సోమనాథ్ భారతి: తనను గృహ హింసకు గురి చేస్తున్నాడని స్వయంగా సోమనాథ్ భార్య ఫిర్యాదు చేయడంతో సెప్టెంబర్ 2015లో ఒకసారి, ఓ యువతిపై దాష్టీకానికి దిగాలని తన మద్దతుదారులను కోరుతున్న వీడియోలు బయటపడటంతో గత నెలలో మరోసారి అరెస్టయ్యారు.
 
జితేందర్ సింగ్ తోమర్: తప్పుడు డిగ్రీ పత్రాలు సమర్పించినట్టు ఆరోపణలను ఎదుర్కొన్నారు. డిగ్రీ చదవకుండానే చదివినట్టు సర్టిఫికెట్లు సృష్టించినట్టు తేలడంతో జూన్ 2015లో అరెస్టయ్యారు.
 
సురీందర్ సింగ్: ఎన్డీఎంసీ ఉద్యోగిపై అందరూ చూస్తుండగానే చెయ్యి చేసుకుని పోలీసులకు అడ్డంగా దొరికిపోయారు. 
 
నరేష్ యాదవ్: మలీర్ కోటా పట్టణంలో పర్యటిస్తున్న వేళ ముస్లింల పవిత్ర గ్రంథం ఖురాన్‌ను అవహేళన చేశారన్న ఆరోపణలపై జూలై 24న అరెస్టయ్యారు.
 
అమానతుల్లా ఖాన్: ఓ యువతిని అత్యాచారం చేసి హత్య చేస్తానని బెదిరించినట్టు ఆరోపణలున్నాయి. జూలై 24న అరెస్ట్ అయి, జైలుకు వెళ్లి ఆపై బెయిల్ తీసుకుని బయటకు వచ్చారు. 
 
మనోజ్ కుమార్: ఢిల్లీ మహిళా కమిషన్‌కు మనోజ్ భార్య ఫిర్యాదు చేయగా, జూలై 2015లో అరెస్టయ్యారు. ఓ భూదందా కేసు కూడా ఈయనపై ఉంది.
 
రాజేష్ రిషీరిషీ: జనక్ పురి ప్రాంతానికి చెందిన ఓ యువతిని లైంగికంగా వేధించిన కేసులో సాక్ష్యాలు లభించగా జూలై 26న అరెస్టయ్యారు. ఆ యువతి ఆత్మహత్యాయత్నం చేసి ప్రాణాలతో బయటపడింది.
 
 దినేష్ మోహానియా: ఓ మహిళతో అసభ్యంగా ప్రవర్తించడంతో పాటు, 60 సంవత్సరాల వృద్ధుడిని కొట్టిన కేసులో అరెస్ట్ అయి, ఆపై బెయిల్ తెచ్చుకున్నారు.
 
మహీందర్ యాదవ్: దోపిడీ, ప్రభుత్వ ఉద్యోగిని కొట్టడం వంటి ఆరోపణలతో ఈ సంవత్సరం జనవరిలో పోలీసులు అదుపులోకి తీసుకోగా, ఆపై బెయిల్ తెచ్చుకున్నారు.
 
అఖిలేష్ త్రిపాఠి: 2013లో నమోదైన దోపిడీ, నేరపూరిత కుట్ర కేసులో నవంబర్ 2015లో పోలీసులు అరెస్ట్ చేశారు.
 
శరద్ చౌహాన్: ఆప్‌లో ఎదగాలంటే శీలంపై మక్కువ వదులుకోవాలని యువతితో వ్యాఖ్యానించినట్టు ఆరోపణ. ఆమె ఆత్మహత్య చేసుకోవడంతో చౌహాన్‌ను జూలై 31న అరెస్ట్ చేశారు.