గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Raju
Last Modified: హైదరాబాద్ , మంగళవారం, 25 ఏప్రియల్ 2017 (05:44 IST)

అర్థిక మంత్రి పదవి ఇస్తాం సర్దుకోండి: పళని గ్రూపు వైఖరితో విసిగిపోయిన పన్నీర్.. విలీనం కష్టమే..

అన్నాడీఎంకే లోని వైరి వర్గాలు అనుకున్నంత సులభంగా విలీన చర్చలను ముగించడం కష్టసాధ్యమేనని మరోసారి రుజువైంది. పార్టీని, రెండాకుల చిహ్నంను నిలబెట్టుకోవడం ముఖ్యమని చర్చలకు అదే ఎజెండాగా ఉండాలని మొదటినుంచి పట్టుపడుతున్న పన్నీర్ సెల్వం వైఖరిని శశికళ గ్రూప్ లె

అన్నాడీఎంకే లోని వైరి వర్గాలు అనుకున్నంత సులభంగా విలీన చర్చలను ముగించడం కష్టసాధ్యమేనని మరోసారి రుజువైంది. పార్టీని, రెండాకుల చిహ్నంను నిలబెట్టుకోవడం ముఖ్యమని చర్చలకు అదే ఎజెండాగా ఉండాలని మొదటినుంచి పట్టుపడుతున్న పన్నీర్ సెల్వం వైఖరిని శశికళ గ్రూప్ లెక్కించకపోగా పన్నీరుకు ఆర్థిక మంత్రి పదవి ఇస్తాం సైలెంట్ అయిపోండి అంటూ మంత్రి జయకుమార్ చేసిన ప్రకటన పన్నీర్ వర్గాన్ని మండించింది. దీంతో గత రెండు రోజులుగా చర్చల కోసం ఇరువర్గాలు చేసుకున్న ప్రాతిపదకే గాలికి ఎగిరిపోయింది. విలీనంపై అందరి అభిప్రాయాలను సేకరించాల్సి ఉందని సీఎం ఎడపాడి వర్గం, ప్రధాన డిమాండ్లను అంగీకరిస్తే చర్చలకు ఆమోదం తెలుపుతామని పన్నీర్‌ వర్గం భీష్మించుకోవడంతో పాటూ పరస్పర విమర్శలు చేసుకోవడంతో విలీన ప్రక్రియకు మరోసారి బ్రేక్‌ పడింది.
 
పార్టీని, రెండాకుల చిహ్నాన్ని కాపాడుకునేందుకు చెన్నై రాయపేటలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో సోమవారం చర్చలు ప్రారంభించాలని రెండు రోజుల క్రితం ఇరువర్గాలు నిర్ణయం తీసుకున్నాయి. ఇందుకోసం ఇరువర్గాలు చర్చల కోసం ఏడుగురు సభ్యులతో కూడిన కమిటీలను వేసుకున్నాయి. ఈ నిర్ణయం మేరకు ఇరువర్గాల కమిటీలు సోమవారం సాయంత్రం 4 గంటలకు కూర్చుని చర్చలు ప్రారంభించాల్సి ఉంది. ఇందుకు సంబంధించి చర్చల్లో ఏమేమి మాట్లాడాలనే అవగాహన కోసం సీఎం ఎడపాడి తన ఇంటిలో సీనియర్‌ మంత్రులతో సమావేశమయ్యారు.
 
కొందరు నేతలు పార్టీ కార్యాలయంలో మీటింగ్‌ పెట్టుకున్నారు. ఎడపాడి సీఎం అయిన తరువాత ప్రజలకు ఆయనపై అభిమానం పెరిగింది, దీనికి తోడు 122 మంది ఎమ్మెల్యేల బలం ఉంది కాబట్టి సీఎం పదవిని వదులుకునేది లేదని మంత్రులు, సీనియర్‌ నేతలు స్పష్టం చేశారు. ఇక ప్రధాన కార్యదర్శి పదవి ఎన్నికల కమిషన్‌ వద్ద విచారణలో ఉన్నందున చర్చల అజెండాలో చేర్చవద్దని వారించారు. అయితే తన ఆధీనంలో ఉన్న ఆర్థిక మంత్రి పదవిని పన్నీర్‌కు అప్పగించేందుకు తనకు ఎలాంటి అభ్యంతరం లేదని జయకుమార్‌ చేసిన ప్రకటన ఇరువర్గాల మధ్య  మళ్లీ నిప్పు రాజేసింది.
 
పన్నీర్‌ సెల్వం సైతం గ్రీన్‌వేస్‌ రోడ్డులోని తన ఇంటిలో తన వర్గ నేతలతో చర్చలు జరిపారు. సీఎం, ప్రధాన కార్యదర్శుల పదవులు కాదు, పార్టీ, రెండాకుల చిహ్నంను నిలబెట్టుకోవడం ముఖ్యమని పన్నీర్‌వర్గం నేతలు అభిప్రాయపడ్డారు. పన్నీరుకు ఆర్థిక మంత్రిత్వ శాఖ ఇవ్వడం ఆయన అంతస్తును తగ్గించాలని ఎడపాడి వర్గం భావిస్తున్నదని వ్యాఖ్యానించారు. శశికళ, దినకరన్‌ నుంచి రాజీనామాలు తీసుకోవాలని, జయ మృతిపై సీబీఐ విచారణకు ఆదేశించాలన్న తమ రెండు ప్రధాన డిమాండ్లపై రాజీపడే ప్రసక్తే లేదని పన్నీర్‌ వర్గానికి చెందిన మాజీ మంత్రి కేపీ మునుస్వామి పేర్కొన్నారు. ఈ రెండు డిమాండ్లను ఎడపాడి వర్గం ఆమోదించిన తరువాతనే చర్చలని ఆయన స్పష్టం చేశారు. ఈ పరిణామాలతో విలీన చర్చలకు విఘాతం ఏర్పడింది. శశికళ, దినకరన్‌ల నుంచి రాజీనామాలు తీసుకోవడం అంత సులువు కాదు కాబట్టి చర్చలకు శాశ్వతంగా తెరపడినట్లు అనుమానించక తప్పదు.