శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 23 ఆగస్టు 2017 (14:00 IST)

ఓపీఎస్ - ఈపీఎస్‌లకు చెక్ : తమిళనాడు ముఖ్యమంత్రిగా కొత్త పేరు!

తమిళనాడు రాజకీయాల్లో అన్నాడీఎంకే బహిష్కృత నేత టీటీవీ దినకరన్ చక్రం తిప్పుతున్నారు. అక్రమాస్తుల కేసులో బెంగుళూరులోని పరప్పణ అగ్రహార జైలులో శిక్ష అనుభవిస్తున్న పిన్ని శశికళతో అపుడపుడూ ములాఖత్ నిర్వహిస్త

తమిళనాడు రాజకీయాల్లో అన్నాడీఎంకే బహిష్కృత నేత టీటీవీ దినకరన్ చక్రం తిప్పుతున్నారు. అక్రమాస్తుల కేసులో బెంగుళూరులోని పరప్పణ అగ్రహార జైలులో శిక్ష అనుభవిస్తున్న పిన్ని శశికళతో అపుడపుడూ ములాఖత్ నిర్వహిస్తూ ఆమె సలహాలు, సూచనల మేరకు రాజకీయాల్లో ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నారు. 
 
ఇందులోభాగంగా, మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంతో చేతులు కలిపిన ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామికి వ్యతిరేకంగా ఆయన తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. అంతేకాకుండా, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి పదవుల నుంచి వారిద్దరినీ దించేంత వరకు విశ్రమించబోమని ప్రకటించారు. అదేసమయంలో అన్నాడీఎంకే ప్రభుత్వాన్ని మాత్రం కూల్చోబోమని స్పష్టం చేస్తూనే ఉంది. 
 
అదేసమయంలో మధ్యేమార్గంగా టీటీవీ దినకరన్ వర్గం ముఖ్యమంత్రి అభ్యర్థిగా కొత్త పేరును తెరపైకి తెచ్చింది. దళితుడు, శశికళ అనుచరుడు అని గుర్తింపు తెచ్చుకున్న తమిళనాడు స్పీకర్ పి.ధనపాల్‌ను ముఖ్యమంత్రిని చేస్తామని టీటీవీ దినకరన్ వర్గం అంటోంది. బుధవారం టీటీవీ దినకరన్ వర్గీయులు పుదుచ్చేరిలోని 'ద వైండ్ ప్లవర్ రిసార్ట్ స్పా'‌లో బిజీబిజీగా మంతనాలు జరుపుతున్నారు. 
 
మరోవైపు విపక్ష నేత ఎంకే స్టాలిన్ కూడా ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని భావిస్తున్నారు. డీఎంకేకు సొంతగా 89 మంది ఎమ్మెల్యలు ఉండగా, దాని మిత్రపక్షమైన కాంగ్రెస్ పార్టీకి మరో 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ముస్లిం లీగ్ పార్టీకి ఒక్క సభ్యుడు ఉన్నాడు. 
 
దీంతో ఆ డీఎంకే కూటిమిలో మొత్తం 98 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. కానీ ప్రభుత్వ ఏర్పాటుకు కనీస మెజార్టీ 117. మరో 20 మంది ఎమ్మెల్యేలను తన వైపునకు తిప్పుకున్నట్టయితే ముఖ్యమంత్రి కుర్చీలో ఎంకే స్టాలిన్ కూర్చొనే అవకాశం ఉంది.