శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Raju
Last Modified: hyderabad , శుక్రవారం, 21 ఏప్రియల్ 2017 (07:38 IST)

విలీనం ఒక డ్రామాయేనా... అన్నాడీఎంకేలో ఆకస్మిక పరిణామాలపై అనుమానాలు.. పన్నీరు సెల్వం మళ్లీ పావేనా?

అన్నాడీఎంకేలోని రెండువర్గాల విలీనం పథకం ప్రకారం ఆడుతున్న నాటకమని కేంద్ర మంత్రి పొన్‌ రాధాకృష్ణన్‌ వ్యాఖ్యానించారు. ఏ కారణం చేత విడిపోయారు, నేడు ఏ కారణం చేత విలీనం అవుతున్నారని ఆయన ప్రశ్నించారు. జయ మరణ మిస్టరీపై విచారణ కమిషన్‌ వేస్తానని పన్నీర్‌సెల్వ

అన్నాడీఎంకేలోని రెండువర్గాల విలీనం పథకం ప్రకారం ఆడుతున్న నాటకమని కేంద్ర మంత్రి పొన్‌ రాధాకృష్ణన్‌ వ్యాఖ్యానించారు.  ఏ కారణం చేత విడిపోయారు, నేడు ఏ కారణం చేత విలీనం అవుతున్నారని ఆయన ప్రశ్నించారు. జయ మరణ మిస్టరీపై విచారణ కమిషన్‌ వేస్తానని పన్నీర్‌సెల్వం చేసిన ప్రకటన విలీనం తరువాత నీరుగారిపోవడమో లేదా కంటితుడుపు కమిషన్‌గా మారడమో జరుగదని గ్యారంటీ ఏమిటని ఆయన ప్రశ్నించారు. మంత్రి ప్రశ్న నేపథ్యంలో పార్టీలో ముసలానికి ప్రధాన కారణమైన శశికళ కుటుంబంపై వేటువేయడం ద్వారా అన్నాడీఎంకేకు పూర్వవైభవం తెస్తామని చాటుకుంటూ సాగుతున్నది చిత్తశుద్ధితో కూడిన విలీనమా మరేదైనా వ్యూహమా అనే అనుమానాలు నెలకొన్నాయి. ఎంజీ రామచంద్రన్‌ స్థాపించిన అన్నాడీఎంకే శకం ఇక ముగిసిపోయిందని అందరూ తీర్మానించుకున్న తరుణంలో తాజాగా చోటుచేసుకున్న అనూహ్యమైన పరిణామాల వల్ల పార్టీతోపాటూ రెండాకుల చిహ్నం కూడా తమకే చేరువ కాగలదని ఇరువర్గాలు నమ్ముతున్నాయి. మరోవైపున విలీనం వెనుక కేవలం పార్టీ ప్రయోజనాలేనా..ఇరువర్గాల విలీనం విశ్వసనీయమైనదేనా అనే చర్చ మొదలైంది.
 
పన్నీర్‌సెల్వం దూరమైన నాటి నుండే తమిళనాడు ప్రభుత్వాన్ని  కేంద్రం టార్గెట్‌ చేసిందని శశికళ వర్గం అనుమానిస్తోంది. ఈ పరిణామాలను తనకు అనుకూలంగా మలుచుకునేందుకు డీఎంకే ఒకవైపు పొంచి ఉంది. మధ్యంతర ఎన్నికలు ముంచుకొస్తే మనుగడ లేదని శశికళ వర్గానికి తెలుసు. చేజేతులా అధికారాన్ని చేజార్చుకునే కంటే శశికళ, దినకరన్‌లపై వేటువేయడం ద్వారా పన్నీర్‌ సెల్వంతో రాజీపడితే కేంద్రంతో సత్సంబంధాలు, ఎంజీఆర్‌ స్థాపించిన అన్నాడీఎంకే, రెండాకుల చిహ్నం కూడా దక్కుతాయని ఎడపాడి పన్నాగంగా ఉంది. కేంద్రం కల్పించిన కష్టాల నుండి గట్టెక్కేందుకు పన్నీర్‌సెల్వంను శశికళ వర్గం పావుగా వాడుకుంటున్నట్లు అనుమానిస్తున్నారు. తనను బహిష్కరిస్తే ప్రభుత్వాన్ని కూల్చివేసే ఎమ్మెల్యేల బలం ఉందని రెండురోజుల క్రితం హెచ్చరించిన దినకరన్‌ వేటుకు వంతపాడటం, శశికళ నోరుమెదపక పోవడం వెనుక అంతరార్థం ఈ వ్యూహంలో భాగమేనని తెలుస్తోంది. 
 
కాగా బీజేపీ వ్యూహం మరోలా ఉంది. తమిళనాడులో రాష్ట్రపతి పాలన విధిస్తే ఆ తరువాత వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో డీఎంకే గెలుపు నల్లేరుమీద నడకకాగలదు. కాంగ్రెస్‌ మిత్రపక్ష డీఎంకే అధికారంలోకి వచ్చేకంటే అస్తవ్యస్తంగా తయారైన అన్నాడీఎంకేను దారికి తెచ్చుకుని తనకు అనుకూలంగా మలుచుకోవడం మేలనే ఆలోచనతోనే తమిళనాడు ప్రభుత్వంపై బీజేపీ పలుకోణాల్లో వత్తిడిపెంచినట్లు భావిస్తున్నారు. రాబోయే అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల నాటికి అన్నాడీఎంకేను మిత్రపక్షంగా చేసుకుని తమిళనాడులో అధికారంలోకి వచ్చేందుకు బీజేపీ చేస్తున్న ప్రయత్నమే వీలీనం వెనుక వ్యూహమని కొందరి అనుమానం. రాష్ట్రపతి పాలన ప్రమాదం నుంచి గట్టెక్కేందుకు శశికళ వర్గం, తమిళనాడులో జెండా పాతేందుకు బీజేపీ..విలీనానికి వ్యూహకర్తలుగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.