గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr

ఒక స్థానం.. ఇద్దరు నేతలు : అమేథీలో నువ్వానేనా అంటున్న ఆ ఇద్దరు!

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అమేథీ లోక్‌సభ స్థానానికి ప్రత్యేక పేరుతో పాటు గుర్తింపు ఉంది. ఈ స్థానం గాంధీ కుటుంబం కంచుకోట. ఈ కంచుకోటను బీటలువారేలా చేయాలని కమలనాథులు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు.

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అమేథీ లోక్‌సభ స్థానానికి ప్రత్యేక పేరుతో పాటు గుర్తింపు ఉంది. ఈ స్థానం గాంధీ కుటుంబం కంచుకోట. ఈ కంచుకోటను బీటలువారేలా చేయాలని కమలనాథులు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం ఆ పార్టీ మహిళా నేత, బుల్లితెర నటి స్మృతి ఇరానీని రంగంలోకి దించారు. దీంతో గత లోక్‌సభ ఎన్నికలు మొదలుకుని ఈ స్థానం చాలా హాట్‌టాపిక్‌గా మారింది. ప్రస్తుతం కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఇక్కడ నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. 
 
అయితే, మంగళవారం అమేథీలో జరిగిన భారీ బహిరంగ సభలో భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌, కేంద్రమంత్రి స్మృతి ఇరానీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అమేథీలో పర్యటించేందుకు రాహుల్‌కు సమయం లేదన్నారు. అందుకే ఆయన నియోజకవర్గంలో అభివృద్ధి లేకుండా పోయిందని విమర్శించారు. 
 
వచ్చే ఎన్నికల్లో అమేథీలో తప్పకుండా భాజపా విజయం సాధిస్తుందని, రాహుల్‌ ఓడిపోవడం ఖాయమని ఆమె జోస్యం చెప్పారు. యూపీలో గతంలో పాలించిన సమాజ్‌వాదీ పార్టీపైనా ఆమె విమర్శనాస్త్రాలు సంధించారు. యువతకు ఉద్యోగాలు కల్పిస్తామని హామీలు ఇచ్చి నెరవేర్చలేదని దుయ్యబట్టారు. భాజపా ర్యాలీ సందర్భంగా అమేథీలో 22 అభివృద్ధి పథకాలను ప్రారంభించారు.