గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Raju
Last Modified: హైదరాబాద్ , మంగళవారం, 18 ఏప్రియల్ 2017 (04:12 IST)

ప్రధాని మోదీనే భద్రతను గాలికొదిలేస్తే .. ఉగ్రవాదులు ఛాన్స్ తీసుకోరా.. భయంతో వణుకుతున్న అధికారులు

ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రోటోకాల్‌ను పక్కన పెట్టి, భద్రతా నిబంధనలను పెద్దగా పట్టించుకోకపోవడం ఆయన వెన్నంటి ఉన్న భద్రతాధికారులను చమటలు పట్టిస్తోంది. దారి మధ్యలో కాన్వాయ్ ఆపి జనం దగ్గరకు వెళ్లడం, సాధారణ మార్గంలో ప్రయాణించడం, ఓపెన్ టాప్ జీపులో గంటలకొద్

ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రోటోకాల్‌ను పక్కన పెట్టి, భద్రతా నిబంధనలను పెద్దగా పట్టించుకోకపోవడం ఆయన వెన్నంటి ఉన్న భద్రతాధికారులను చమటలు పట్టిస్తోంది. దారి మధ్యలో కాన్వాయ్ ఆపి జనం దగ్గరకు వెళ్లడం, సాధారణ మార్గంలో ప్రయాణించడం, ఓపెన్ టాప్ జీపులో గంటలకొద్ది జనాలకు అభివాదం చేస్తూ ముందుకు సాగడం వంటి భద్రతా ఉల్లంఘనల చర్యలకు ప్రధాని మోదీ పదే పదే పాల్పడుతుండడంతో.  ఉగ్రవాదలకు చాన్స్ ఇచ్చినట్లు కాదా అని భద్రతాధికారులు వణుకుతున్నారు. ఈ నెల ప్రారంభంలో బంగ్లాదేశ్‌ ప్రధానమంత్రి షేక్‌ హసీనా వచ్చినప్పుడు ఢిల్లీ విమానాశ్రయానికి వెళ్లేందుకు ఆయన ట్రాఫిక్‌ నియంత్రణలు ఉన్న వీవీఐపీ మార్గంలో కాకుండా.. సాధారణ మార్గంలో వెళ్లిపోయారు. అటువైపు మార్గంలో పెద్దగా పోలీసు భద్రత కూడా ఏమీ లేదు.
 
ఇప్పుడు సొంత రాష్ట్రమైన గుజరాత్ పర్యటనలో ప్రధాని తన కాన్వాయ్‌నే ఆపించి తన మార్గానికి అడ్డంగా వచ్చిన చిన్నారిని దగ్గరకు తీసుకని పలకరించడంతో అధికారులకు పిచ్చెక్కినంత పనయ్యింది. ఇటీవలి  తన గుజరాత్‌ పర్యటనలో భాగంగా కాన్వాయ్‌లో వెళ్తూ.. ఉన్నట్టుండి తన వాహనాన్ని ఆపారు. ఏమైందో, ఎందుకు ఆగారో ఎవరికీ కాసేపు అర్థం కాలేదు. రోడ్డుకు ఇరువైపులా ఆయన కోసం చాలామంది అభిమానులు చేతులు ఊపుతూ ఆయనను అభినందిస్తున్నా, ప్రధాని దృష్టిని ఆకట్టుకున్నది మాత్రం నాలుగేళ్ల చిన్నారి. ఎందుకంటే, ఆ పాప ఉన్నట్టుండి రోడ్డు మీదకు వచ్చేసింది. 
 
అటువైపుగా ప్రధాని కాన్వాయ్‌ వాహనాలు వెళ్తున్నాయి. దాంతో ఒక్కసారిగా అంతా అప్రమత్తమయ్యారు. రెండు రోజుల గుజరాత్‌ పర్యటన ముగించుకుని సూరత్‌ విమానాశ్రయానికి వెళ్లిపోయే సమయంలో ఈ ఘటన జరిగింది. సెక్యూరిటీ సిబ్బందికి చెప్పడంతో.. వాళ్లు ఆ పాపను ఆయన దగ్గరకు తీసుకొచ్చారు. చిన్నారిని ఆప్యాయంగా హత్తుకుని, పాపతో నాలుగు మాటలు మాట్లాడి.. ఆమెకు టాటా చెప్పి ఆ తర్వాత వెళ్లిపోయారు. దాంతో అక్కడున్న జనమంతా ఆ దృశ్యాన్ని ఆసక్తిగా గమనిస్తూ ’మోదీ.. మోదీ‘ అని నినదించారు.
 
ప్రజలకు దగ్గరవడానికి మోదీ ఎంచుకుంటున్న మార్గం ఆయన పాపులారిటీని పెంచడం మాటేమో కానీ అలాంటి సమయాల్లో అనుకోనివి ఘటనలు జరిగితే ఆ నష్టానికి ఎవరు బాధ్యత అన్న విషయమై ప్రధాని కాన్వాయ్ భద్రతాధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. మోదీ బహిరంగ సభలోనే బాంబులు పేల్చడానికి సిద్ధపడిన వారు ఆయన భద్రతాపరమైన ఉల్లంఘనలను అవకాశంగా తీసుకుంటే ఎలా అనేది సమస్యే మరి.