శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By JSK
Last Modified: సోమవారం, 7 మార్చి 2016 (23:09 IST)

'అబ్బా... ఏం సరుకురా దీనిది..' అనేవారిని సహిస్తున్నాం... నటుడు అనుపమ్ ఖేర్ ప్రసంగం పూర్తి పాఠం

సుర్జేవాలా గారు.. కేంద్ర ప్రభుత్వం అంత అసహనంగా ఉంది.. ఇంత అసహనంగా ఉంది అంటూ మీరు ఓ లిస్ట్ తయారు చేసుకొచ్చి ప్రసంగించారు.

నమస్కారం.. నేను హిందీలో మాట్లాడాలనుకుంటున్నాను.. ఎందుకంటే నేను హిందీలో ఆలోచిస్తాను కాబట్టి.. ఒకవేళ మధ్య మధ్యలో నా నుంచి ఇంగ్లీష్ పదాలు వస్తే అది మీ అదృష్టం క్రింద లెక్క! నేను పర్సనల్ కామెంట్స్‌ చేయకూడదని చాలా ఆలోచించుకుని వచ్చాను. కానీ, తప్పేటట్టు లేదు. ఈ సభలో ఇంతకుముందు జస్టిస్ గంగూలీ చేసిన ప్రసంగం చూసి నేను బాధతో పాటు షాక్ కూడా తిన్నాను. ఒక్క జడ్జ్ అయ్యి ఉండి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును తప్పుపడుతుండటం దురదృష్టకరం.

(జస్టిస్ గంగూలీని చూస్తూ) న్యాయవిద్యార్థినిపై లైంగిక వేధింపుల కేసులో మీడియా మిమ్మల్ని ప్రశ్నలు అడిగినప్పుడు .. వాళ్ల మీద అసహనం ప్రదర్శించిన మీరు.. ఈ రోజు మీరు జేఎన్‌యూలో జరిగిందంతా కరెక్టే అని సమర్థించడం పెద్ద తప్పు! తాజాగా, ఫిబ్రవరి తొమ్మిదిన యాంటీ- ఇండియా క్యాంపెయిన్లో పాల్గొన్న ఒక వ్యక్తిని మనం ‘హీరో’ని చేస్తున్నాం. 
 
ఆ రోజు జేఎన్‌యూ విద్యార్థులు ఏ నినాదాలు చేశారో తెలుసా? ‘అఫ్జల్ గురు.. మేం సిగ్గుపడుతున్నాం. నిన్ను హత్య చేసిన వాళ్లు ఇంకా బ్రతికున్నారు?’ అంటే.. ఇక్కడ అఫ్జల్‌గురును హత్య చేసిన వాళ్లు ఎవరు? అంటే వాళ్ల ఉద్దేశం సుప్రీంకోర్టు జడ్జిలు అఫ్జల్‌గురును హత్య చేశారా? ‘భారత్‌ను ముక్కలుముక్కలు చేస్తాం.. ఇన్‌ష్‌ అల్లా..ఇన్‌షా అల్లా’.. ఇంత దారుణమైన నినాదాలు చేస్తే వాటిని ఖండించకుండా.. సుప్రీంకోర్టును మీరు(జస్టిస్ గంగూలీ) తప్పుపట్టడం ఎంతవరకు సమర్థనీయం! అంటే.. సుప్రీం కోర్టు జడ్జిలు అప్జల్‌గురును హత్య చేశారా? ఒకప్పుడు సుప్రీంకోర్టు జడ్జిగా ఉండి జేఎన్‌యూ ఘటనను సమర్థించినందుకు మిమ్మల్ని ఎవరూ క్షమించరు!
 
అనంతరం కాంగ్రెస్ ప్రతినిథి సుర్జేవాలాను ఉద్దేశించి మాట్లాడుతూ..
సుర్జేవాలా గారు.. కేంద్ర ప్రభుత్వం అంత అసహనంగా ఉంది.. ఇంత అసహనంగా ఉంది అంటూ మీరు ఓ లిస్ట్ తయారు చేసుకొచ్చి ప్రసంగించారు. కానీ, 1975లో దేశంలో అత్యంత అసహనమైన ఘటన అయిన ‘ఎమర్జెన్సీ’ని విధించింది మీ నాయకురాలు ఇందిరాగాంధీనే! దేశంలో ఇప్పటిదాకా జరిగిన అత్యంత దారుణమైన ఘటన అదే! అప్పట్లో ఎమర్జన్సీకి వ్యతిరేకంగా ఎవరెవరైతే నినదించారో.. వాళ్లందరినీ నిర్థాక్షిణ్యంగా జైల్లో పెట్టి కుళ్లబొడిచారు. ఎమర్జెన్సీ పై ఆఖరికి ఇళ్లలో చర్చించుకున్నట్టు తెలిసినా.. వారిని కూడా ఉపేక్షించకుండా ఇందిరాగాంధీ జైల్లో పెట్టించేసింది. అలా, జైలుకెళ్లిన వాళ్లలో మా తాతగారు కూడా ఉన్నారు. అసలు, ఈ దేశంలో అత్యంత సహనం కలిగిన వ్యక్తులు ఎవరో తెలుసా? కాంగ్రెస్ పార్టీ వాళ్లు.. ప్రైమ్ మినిష్టర్‌గా తాము ప్రొజెక్ట్ చేస్తున్న ఆ వ్యక్తిని (రాహుల్‌ గాంధీని ఉద్దేశించి) ఇన్నాళ్ల నుంచి ఓపిగ్గా భరిస్తున్నందుకు కాంగ్రెస్ పార్టీ నాయకులు నిజంగా గ్రేట్‌! 
 
కాంగ్రెస్‌లో పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే.. తమ ప్రధానమంత్రి అభ్యర్థి సరైన వ్యక్తి కాదని తెలిసినా.. ఆ మాట ఒకళ్లకొకళ్లు చెప్పుకోవడానికి కూడా వారికి భయం! ఇలాంటి వ్యక్తిని పెట్టుకుని మనం అడ్డంగా బుక్కైపోయాంరా బాబు అని మనసులో అనుకుంటూ.. బయటకు మాత్రం ఆ వ్యక్తి పట్ల వినయవిధేయతలను ప్రదర్శిస్తూ చాలా గొప్ప సహనాన్ని కాంగ్రెస్ వాళ్లు చూపిస్తున్నారు. అదే, సహనాన్ని మీరు పార్లమెంట్‌లో కూడా చూపించండి. మీరు అలాంటి వ్యక్తిని భరిస్తున్నారంటే.. మీరు ప్రపంచంలో ఎవరినైనా భరించగలరు. ఆ వ్యక్తిని(రాహుల్‌ ను ఉద్దేశించి) భరించడంలో చూపిస్తున్న సహనాన్ని మీరు పార్లమెంట్‌లో చూపించండి.. అనేక సమస్యలు పరిష్కారమవుతాయి.
 
మీలో ఏడాది క్రిందట ఎవరైనా ‘అసహనం’ అనే పదాన్ని ఎవరైనా విన్నారా.. కచ్చితంగా విని ఉండరు! ఈ పదాన్ని కొందరు కావాలని బాగా మార్కెట్ చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో ఓటమిని జీర్ణించుకోలేక.. ప్రభుత్వం మీద కక్షతో ఈ పదాన్ని క్రియేట్ చేశారు. మోదీ సారధ్యంలో ఎన్‌డీఏ కూటమి అఖండ విజయం సాధించడం.. ఛాయ్‌ వాలా ప్రధానిమంత్రి అవ్వడాన్ని వీళ్లు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇంగ్లీష్ వాళ్ల దగ్గర, మొఘలాయిల దగ్గర.. పాశ్చాత్యుల దగ్గర గులామ్‌గిరీ చేసిన వీళ్లకు ఓ ఛాయ్‌వాలా ప్రధానమంత్రి అవ్వడాన్ని తట్టుకోలేకపోతున్నారు. మన దేశ ప్రధాని గత రెండేళ్ల నుంచి ఒక్క రోజు కూడా సెలవు పెట్టలేదు. ఈ మాట అంటున్నానని నేను మోదీ తరపున వకాల్తాపుచ్చుకుంటున్నానని అనుకోకండి.. ఓ దేశ పౌరుడిగా నేను నిజం మాట్లాడుతున్నాను! నా భార్య కిరణ్ ఖేర్‌ బీజేపీలో ఉంది కాబట్టి నేను ఆ పార్టీ తరపున మాట్లాడుతున్నానని చాలా మంది విమర్శిస్తుంటుంటారు. నేను కిరణ్ ఖేర్‌ను పెళ్లాడి 30 సంవత్సారాలయ్యింది.. బీజేపీ గురించి మాట్లాడటం ద్వారా ఆమె మెప్పు మరియు విశ్వసనీయతను పొందాల్సిన అవసరం నాకు ఇప్పుడు ఏమాత్రం లేదు.
 
ప్రధాని మోదీ విదేశీ పర్యటనలను కూడా దేశంలో కొందరు మేథావులు భరించలేకపోతున్నారు. మోదీకి ముందు పదేళ్లపాటు నోరుమూసుకుని కూర్చుని ఉన్న ఓ ప్రధానిమంత్రిని మీరు హాయిగా భరించారు. కానీ, ఇప్పటి ప్రధాని విదేశీ పర్యటనల ద్వారా భారత్‌ను అంతర్జాతీయంగా బలోపేతం చేస్తుంటే మాత్రం వీళ్లు తట్టుకోలేకపోతున్నారు. గుర్తుపెట్టుకోండి.. మన ప్రధాని గత రెండేళ్లుగా ఒక్క రోజు కూడా సెలవు పెట్టలేదు. ఆయన గత రెండేళ్లుగా తన దీపావళిని కశ్మీర్ వెళ్లి అక్కడి సైనికులతో జరుపుకున్నారు. ఇది కూడా వారు భరించలేకపోతున్నారు. ఇలా, మోదీ చేస్తున్న పనులు చూడలేక.. ఆయనను దెబ్బకొట్టడానికి ఓ కొత్త పదం క్రియేట్ చేద్దామని మన దేశంలో కుహనా మేథావులు చర్చలు మొదలుపెట్టారు. 
 
‘ మోదీని ఎలా దెబ్బకొడదాం.. ఆయన మనకు ఎక్కడా దొరకట్లేదు.. కనీసం అవినీతి విషయాన్ని హైలెట్ చేద్దామంటే అక్కడ కూడా ఆయన దొరకడం లేదు’ అని వీళ్లు చాలా మథనపడ్డారు. మీరు చెప్పండి.. గత రెండేళ్లలో ఒక్క అవినీతి కుంభకుణమైనా జరిగిందా? అదే పదేళ్ల యూపీఏ హయాంలో ఎప్పుడు చేసినా అవినీతి మీదే చర్చే జరిగేది? యూపీఏ హయాంలోని పదేళ్లలో ఎప్పుడు చూసినా ‘2జీ, 3జీ..ఏజీ.. ఓజీ’ అంటూ ఏదో ఒక కుంభకోణం వెలుగులోకొచ్చేది. దీంతో, ఏం చేద్దాం.. ఏదో ఒక దాన్ని క్రియేట్‌ చేసి.. మోదీకి వ్యతిరేకంగా మనం దేశం మీదకి వదలాలి అంటూ ఆఖరికి ‘అసహనం’ అనే పదాన్ని వీళ్లు దొరకబొచ్చుకున్నారు. తదనంతరం ‘ఇన్‌టాలరెంట్‌.. అసహనం’ అంటూ బాగా ప్రచారం చేయడం మొదలుపెట్టారు.
 
అసలు దేశంలో అసహనం గురించి ఎవరు మాట్లాడుతున్నారో తెలుసా? ధనికులు, మేథావులు, చుట్టూ 20 మంది బాడీగార్డ్ లను పెట్టుకుని ప్రయాణించే సెలబ్రిటీలు ‘అసహనం’ గురించి మాట్లాడుతున్నారు. కానీ, రోడ్డు మీద పని చేసుకునే వ్యక్తిని ‘ఇన్‌టాలరెన్స్’ గురించి అడిగితే.. అతడు ఏం సమాధానం చెప్పాడో తెలుసా? ‘రోజు తినడానికి సరిపడే అన్నం దొరికితే అదే మాకు అదృష్టం.. మాకు ఇలాంటి అసహనం లాంటి పదాలేవి తెలియదు బాబు.. రోజూ నాకు పని దొరికితే చాలు ‘ అని సమాధానం చెప్పాడు! కానీ, ఫైవ్ స్టార్ హోటల్స్‌లో వజ్రాల రింగులు, ఆభరణాలు ధరించేవాళ్లు, షాంపెయిన్ బాటిల్స్ సిప్ చేస్తూ పార్టీలు చేసుకునే వ్యక్తులు..’ఇండియా ఈజ్ ఎన్ ఇన్‌టాలరెంట్ కంట్రీ’ అంటూ అమెరికన్ ఇంగ్లీష్ యాసలో సోది స్టేట్‌మెంట్లు ఇస్తుంటారు. అమెరికా అధ్యక్ష అభ్యర్థుల్లో ఒకరు.. ‘ముస్లింలను అమెరికా నుంచి తరిమివేయాలి’ అంటూ స్టేట్‌మెంట్‌ ఇచ్చారు. అదీ అసహనం అంటే.. అలాంటి వాళ్లు డేంజరస్ వ్యక్తులు! 
 
ఇటీవల మన ప్రధాని మోదీ ఒక స్టేట్‌మెంట్ ఇచ్చారు. ‘పార్టీలు అధికారంలోకి వస్తూ ఉంటాయి.. పోతూ ఉంటాయి.. ఏ పార్టీ వచ్చినా దేశం బాగుండాలి..దేశానికి ప్రాధాన్యత ఇవ్వాలి’ అంటూ వ్యాఖ్యానించారు. అలాంటి వ్యక్తి మీద మీరు సహేతుకమైన కారణం లేకుండా నెగటివ్ ప్రచారం చేస్తారా? గుర్తుపెట్టుకోండి.. ఆయన మీకు కూడా ప్రధానమంత్రే.. ఆయన ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ప్రధాని. మిమ్మల్ని అడుక్కుని ఎన్నికైన ప్రధాని కాదు. అప్పట్లో మోదీకి అమెరికా వీసా ఇవ్వకూడదని ఎవరైతై ప్రచారం చేశారో.. వారు మోదీ ప్రధాని కావడం ప్రస్తుతం జీర్ణించుకోలేకపోతున్నారు. అధికారంలోకి వచ్చాక మోదీని అమెరికా ప్రభుత్వం తమ దేశానికి ఆహ్వానించడం.. ఆయన అక్కడకు వెళ్లి ఒబామాను ఆలింగనం చేసుకోవడం.. పర్యటన విజయవంతమవడంతో వీళ్లకు కడుపులో మంట మరీ ఎక్కవైపోయింది.
 
అలాగే, ఎవరైతే మోదీకి మద్దతిస్తున్నారో వాళ్లందిరినీ క్రెడిబిలిటీని దెబ్బతీయాలని ఈ కుహునా సెక్యులర మేథావులు నిర్ణయించుకున్నారు. దేశంలో ఓ వ్యూహం ప్రకారం జరుగుతున్న ‘అసహనం’ నిజం కాదని నేను ఒక ర్యాలీ చేస్తే.. నన్ను మోదీ ‘చెంచా’ అన్నారు. నాకు పద్మభూషణ్ అవార్డ్ వస్తే.. నేను ‘చెంచా’ను కాబట్టి వచ్చిందని విమర్శించారు. నాకు వ్యతిరేకంగా పత్రికల్లో అనేకమంది ఎడిటోరియల్‌ ఆర్టికల్స్ రాశారు. మన దేశంలో మీడియా.. 46 ఏళ్ల రాహుల్ గాంధీని యూత్ లీడర్‌‌గా.. యూత్‌ ఐకాన్‌గా ప్రొజెక్ట్ చేస్తోంది. ఆయన కన్నా చాలా తక్కువ వయసున్న స్మృతి ఇరానీని పార్లమెంట్‌లో ప్రసంగం చేసిన తర్వాత ‘ఆంటీ నేషనల్‌’ అంటూ పత్రికల్లో దారుణమైన హెడ్డింగ్‌ పెట్టారు. 
 
రాహుల్ గాంధీ నరేంద్రమోదీ సామర్థ్యంలో పదో వంతు సాధించినా.. నా ఓటు రాహుల్‌ గాంధీకి నేను వేస్తాను. దేశం కోసం మోదీకి ఐదేళ్ల సమయం ఇవ్వండి. కావాంటే ఐదేళ్ల తర్వా మాకు ఇలాంటి అసహన ప్రభుత్వం అక్కర్లేదని పంపించేయండి… ఎన్నికల్లో కావాలంటే మోదీని ఓడించండి. కానీ, ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన మోదీని ఐదేళ్ల పాటు సవ్యంగా పాలించనివ్వండి! కాంగ్రెస్ ఎంపీ దిగ్విజయ్‌ సింగ్ ఓ పబ్లిక్ ఫంక్షన్‌లో మరో కాంగ్రెస్ లేడీ ఎంపీని చూసి.. ‘అబ్బా ఏం సరుకురా దీనిది’.. అని అత్యంత అసభ్యంగా వ్యాఖ్యానించాడు. ఇంతకన్నా సంస్కారహీనం ఏమన్నా ఉందా? అలాగని.. నేను బీజేపీలో అందరినీ సమర్థించడం లేదు. 
 
వివాదస్పద వ్యాఖ్యలు చేసే సాథ్వి ప్రాచీ, యోగి ఆదిత్యనాథ్‌ లాంటి వారిని కచ్చితంగా జైలుకి పంపించాల్సిందే. కానీ, ఒకరిద్దరు చేసే వ్యాఖ్యలు.. ఒకటో, రెండో సంఘటనలు చూసి దేశంలో ‘అసహనం’ పెరిగిపోతుందంటూ గొంతుచించుకోవడం తప్పు! జస్టిన్ గంగూలీ.. మీరు చేసిన ప్రసంగం నచ్చినా.. నచ్చకపోయినా ఓపిగ్గా ఈ సభలోని ప్రజలు విన్నారు కదా.. ఇదే సహనం అంటే! కానీ, మీ అసహనాన్ని నేను టీవీలో చూశాను.. లైంగిక వేధింపులు చేస్తున్నారంటూ ఓ న్యాయవిద్యార్థిని మీపై చేసిన ఆరోపణలపై విలేకర్లు మిమ్మల్ని ప్రశ్నలు వేస్తున్నప్పుడు.. మీరు కెమెరాలను తోసేస్తూ చిరాగ్గా ఎంతటి అసహనం వ్యక్తం చేశారో నేను చూశాను. ప్రియ మిత్రులారా! ఇండియా.. గొప్ప దేశం.. అందుకే, తీవ్ర అసహనం కలిగిన జస్టిస్ గంగూలీ లాంటి వ్యక్తులను మనం సహనంతో భరిద్దాం!