బుధవారం, 17 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : ఆదివారం, 25 అక్టోబరు 2015 (10:48 IST)

బీహార్ మూడో దశ ఎన్నికలు : నేడు ప్రధాని నరేంద్ర మోడీ విస్తృత ప్రచారం

బీహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియలో భాగంగా మూడో దశ ఎన్నికల ప్రచారం కోసం అగ్రనేతలు రంగంలోకి దిగుతున్నారు. ఇందులోభాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆదివారం బీహార్‌లో విస్తృత పర్యటన జరిపి ప్రచారం చేయనున్నారు. వరుస ర్యాలీలు నిర్వహించనున్నారు. కేంద్రమంత్రి వీకే సింగ్‌ దళితవ్యతిరేక వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తు లౌకికకూటమి పరిస్థితులను అనుకూలంగా మార్చుకుంటుండడంతో నరేంద్ర మోడీ సుడిగాలి పర్యటనకు రంగం సిద్ధమైంది. 
 
ఈ నేపథ్యంలో ఆదివారం నుంచి బీహార్‌ ఉత్తర, మధ్య, ఈశాన్య ప్రాంతాల్లో 22 జిల్లాల్లో చేపట్టనున్న 17 ర్యాలీల్లో ఆయన పాల్గొంటారని బీహార్‌ భాజపా వర్గాలు వెల్లడించాయి. ఈ ప్రాంతాల్లో తదుపరి మూడు దశల్లో మొత్తం 162 శాసనసభ స్థానాలకు పోలింగ్‌ జరగనుంది. వీకే సింగ్‌ వివాదం, పప్పు ధాన్యాల ధరల పెరుగుదల అంశాలను లేవనెత్తుతూ లౌకికకూటమి నాయకులు ఓటర్లను ప్రలోభపెడుతున్నాని భాజపా భావిస్తోంది. 
 
ఈ నేపథ్యంలో లౌకికకూటమి వ్యూహాలను తిప్పికొట్టేలా ప్రధాని మోడీ ఆధ్వర్యంలో భారీగా ప్రచారానికి తెరతీసింది. మరోవైపు తన వ్యాఖ్యలను వక్రీకరించారని ఇప్పటికే వీకేసింగ్‌ ప్రకటించారు. కేంద్ర మంత్రులు అరుణ్‌జైట్లీ, రామ్‌ విలాస్‌ పాసవాన్‌, రాధేమోహన్‌ సింగ్‌ తదితరులు వీకే సింగ్‌ చేశాడంటున్న వ్యాఖ్యలన్ని కొంతమంది కావాలని చేస్తున్న దుష్ప్రచారంగా పేర్కొన్నారు. 
 
అలాగే పప్పుధాన్యాల ధరల పెరుగుదలకు నితీశ్‌కుమార్‌ ప్రభుత్వమే కారణమని, అక్రమ నిల్వదారులపై రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టడం లేదని ఆరోపించారు. పాట్నా, నలంద, వైశాలి, హాజీపూర్‌, సరణ్‌లలో ఆదివారం నిర్వహించనున్న మోడీ ర్యాలీలకు ప్రజలు తరలివస్తారని భాజపా వర్గాలు తెలిపాయి. తదుపరి అక్టోబర్‌ 26న బక్సర్‌, సివన్‌ తదితర ప్రాంతాల్లో ప్రచారం చేస్తారని పేర్కొన్నాయి. అనంతరం నవంబర్‌ 1న గోపాల్‌గంజ్‌, ముజఫర్‌పూర్‌లో ర్యాలీలు చేపడతారని వివరించాయి.