శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. సెన్సెక్స్
Written By pnr
Last Updated : సోమవారం, 2 నవంబరు 2015 (17:22 IST)

నష్టాల్లోనే ముగిసిన సెన్సెక్స్.. స్వల్పంగా తగ్గిన బంగారం ధర

బాంబే స్టాక్ మార్కెట్‌లో సెన్సెక్స్ సూచీ గాడిలో పడలేదు. అక్టోబర్ నెల ఆఖరి వారంలో గణనీయమైన నష్టాలను చవిచూసిన సెన్సెక్స్ సూచీ... నవంబర్ నెల మొదటి రోజు ట్రేడింగ్ (సోమవారం)లో కూడా నష్టాలతోనే ముగిసింది. ఉదయం పూట సెషన్ ఆరంభంలో లాభాల్లో ఉన్నప్పటికీ, నిమిషాల వ్యవధిలో భారీ నష్టం దిశగా సాగిన సూచికలు, ఆపై బ్యాంకులు, ఆటో సెక్టార్లలోని ఈక్విటీలకు వచ్చిన కొనుగోలు మద్దతుతో స్వల్పంగా తేరుకున్నా నష్టం మాత్రం తప్పలేదు. 
 
ఫలితంగా సోమవారం నాటి సెషన్ ముగిసేసరికి బీఎస్ఈ సెన్సెక్స్ 97.68 పాయింట్లు పడిపోయి 0.37 శాతం నష్టంతో 26,559.15 పాయింట్ల వద్ద, నిఫ్టీ 15 పాయింట్లు పడిపోయి 0.15 శాతం నష్టంతో 8,050.80 పాయింట్ల వద్దకు చేరాయి. ఈ ట్రేడింగ్‌లో బీఎస్ఈలో మిడ్ క్యాప్ 0.08 శాతం లాభపడగా, స్మాల్ క్యాప్ 0.20 శాతం నష్టపోయింది. 
 
ముఖ్యంగా, టెక్ మహీంద్రా, యస్ బ్యాంక్, ఏసీసీ, మహీంద్రా అండ్ మహీంద్రా, కోల్ ఇండియా తదితర కంపెనీల షేర్లు లాభపడగా, బజాజ్ ఆటో, టాటా స్టీల్, వీఈడీఎల్, హిందాల్కో, సన్ ఫార్మా తదితర కంపెనీలు నష్టపోయాయి. 
 
ఇదిలావుండగా, సోమవారం బంగారం ధర స్వల్పంగా తగ్గింది. 99.9 స్వచ్ఛత గల పది గ్రాముల పసిడి ధర రూ.10 తగ్గి రూ.26,810కి చేరింది. ప్రపంచ మార్కెట్ల ప్రభావం, నగల వ్యాపారులు కొనుగోళ్లు చేయకపోవడం తదితర కారణాల వల్ల దీని ధర తగ్గిందని బులియన్‌ మార్కెట్‌ వర్గాలు తెలిపాయి. 
 
అంతర్జాతీయంగా సింగపూర్‌ బులియన్‌ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 0.7శాతం తగ్గి 1,134.39 అమెరికన్‌ డాలర్లుగా ఉంది. అలాగే వెండి ధర కూడా తగ్గింది. రూ.270 తగ్గడంతో కేజీ వెండి ధర రూ.36,500కి చేరింది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారులు కొనుగోళ్లు చేయకపోవడంతో డిమాండు తగ్గిందని దీంతో ధర తగ్గిందని మార్కెట్‌ వర్గాలు తెలిపాయి.