మంగళవారం, 16 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. సెన్సెక్స్
Written By pnr
Last Updated : సోమవారం, 9 నవంబరు 2015 (11:13 IST)

మార్కెట్‌పై బీహార్ ఎన్నికల రిజల్ట్స్ ఎఫెక్ట్.. 600 పాయింట్లకు పైగా సెన్సెక్స్ నష్టం

బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు బాంబే స్టాక్ మార్కెట్‌పై తీవ్ర ప్రభావం చూపాయి. ఫలితంగా సోమవారం ఉదయం ప్రారంభమైన స్టాక్ మార్కెట్ ట్రేడింగ్‌లో సెన్సెక్స్ సూచీ ఏకంగా 600 పాయింట్ల మేరకు నష్టపోయింది. ఆ తర్వాత అంటే 10:45 గంటల సమయంలో 325 పాయింట్ల నష్టంలో ఉంది. 
 
బీహార్ ఎన్నికల్లో నరేంద్ర మోడీ నేతృత్వంలోని బీజేపీ విజయం సాధిస్తే, పలు కీలక బిల్లులు, సంస్కరణల అమలుకు మార్గం సుగమమవుతుందని పెట్టుబడిదారులు భావించడమే ఇందుకు కారణం. అయితే, బీజేపీ ఘోర పరాభవంతో గూడ్స్ అండ్ సర్వీస్ టాక్స్ నుంచి బీమా సంస్కరణలు, భూసేకరణ, వివిధ రంగాల్లో ఎఫ్డీఐ పెంపు వంటి ముఖ్యమైన బిల్లులిప్పడు విపక్షాల నుంచి మరింత అడ్డంకులను ఎదుర్కోనున్నాయి. 
 
మరోవైపు 'మేకిన్ ఇండియా' అంటూ మోడీ చేపట్టిన ప్రపంచవ్యాప్త ప్రచారం అనంతరం, విదేశీ ఇన్వెస్టర్లు సైతం బీహార్ ఎన్నికలను నిశితంగా పరిశీలించారు. వీరంతా ఇప్పుడు దేశానికి పెట్టుబడులు పెట్టాలంటే మరోసారి ఆలోచించాల్సిన పరిస్థితి నెలకొంది. ఇక వచ్చే సంవత్సరం కేరళ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ సహా ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగనున్నాయి. బీహార్‌లో గెలిచి, ఆ రాష్ట్రాల్లో సత్తా చాటాలని భావించిన బీజేపీకి చుక్కెదురు కావడం కూడా ఇన్వెస్టర్ల మనోభావాలను దెబ్బతీయడంతో మార్కెట్ ట్రేడ్ నష్టాల్లో ప్రారంభమైంది.