శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By pnr
Last Updated : మంగళవారం, 7 ఆగస్టు 2018 (08:56 IST)

పని చేయని అవయవాలు... అత్యంత విషమంగా కరుణానిధి ఆరోగ్యం

డీఎంకే అధినేత, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎం.కరుణానిధి ఆరోగ్యం అత్యంత విషమంగా ఉంది. ఆయన వృద్దాప్యం కారణంగా శరీరంలోని అంతర్గత అవయవాలు బాగా క్షీణించిపోయాయి. ఫలితంగా వైద్యానికి కూడా అవి స్పందించడం లేదు. ఫ

డీఎంకే అధినేత, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎం.కరుణానిధి ఆరోగ్యం అత్యంత విషమంగా ఉంది. ఆయన వృద్దాప్యం కారణంగా శరీరంలోని అంతర్గత అవయవాలు బాగా క్షీణించిపోయాయి. ఫలితంగా వైద్యానికి కూడా అవి స్పందించడం లేదు. ఫలితంగానే ఆయన ఆరోగ్యం అత్యంత విషమంగా ఉన్నట్టు వైద్యులు ప్రకటించారు.
 
సోమవారం రాత్రి 6.30 గంటలకు విడుదల చేసిన మెడికల్ బులిటెన్‌లో మరో 24 గంటలు గడిస్తేగానీ ఏమీ చెప్పలేమని వైద్యులు తేల్చారు. మరోవైపు, మంగళవారం కరుణానిధిని పరామర్శించేందుకు ప్రత్యేక వైద్యుడు గోపాల్ చెన్నై కావేరీ ఆస్పత్రికి వచ్చారు. ఆయన పర్యవేక్షణలో వైద్యులు డీఎంకే చీఫ్‌కు వైద్యం చేస్తున్నారు. 
 
కాగా, గత నెల 27వ తేదీ అర్థరాత్రి తీవ్ర అస్వస్థత కారణంగా చెన్నైలోని కావేరీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో డీఎంకే అధినేత ఎం.కరుణానిధి (95) చేరిన విషయం తెల్సిందే. గత 10 రోజులుగా ఆస్పత్రిలోనే చికిత్స పొందుతూ వచ్చిన ఆయన ఆరోగ్యం సోమవారం మరింతగా క్షీణించింది. వచ్చే 24 గంటల్లో చికిత్సకు ఆయన శరీరం స్పందించే విధానాన్ని బట్టి పరిస్థితిని అంచనా వేయగలమని.. ఆయనకు వైద్యం అందిస్తున్న కావేరి ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. దీంతో డీఎంకే వర్గాలు ఒక్కసారిగా తీవ్ర ఆందోళనకు గురయ్యాయి. 
 
గత యేడాదిన్నర కాలంగా అనారోగ్యంతో ఇంటికే పరిమితమైన కరుణానిధి, గత శుక్రవారం తీవ్ర అస్వస్థతకు గురవడంతో, ఆస్పత్రిలో చేరిన విషయం తెల్సిందే. నిపుణులైన వైద్యులు అందించిన చికిత్సతో ఆయన క్రమక్రమంగా కోలుకోవడం మొదలుపెట్టారు. దీంతో వైద్యులు ఆయనను రెండు రోజులపాటు కుర్చీలో కూర్చోబెట్టి ఫిజియోథెరపీ కూడా చేశారు. కానీ, సోమవారం ఉదయం ఆయనకు ఉన్నట్టుండి ఆరోగ్యం బాగా క్షీణించింది.
 
ఈ నేపథ్యంలో సాయంత్రం 6.30 గంటలకు ఆస్పత్రి ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ అరవిందన్‌ సెల్వరాజ్‌ ఓ మెడికల్ బులెటిన్‌‌ను విడుదల చేశారు. 'వృద్ధాప్యం కారణంగా క్షీణించిన అవయవాలను సక్రమంగా పని చేయించడం సవాలుగా మారింది. అయినప్పటికీ ఆయనకు నిపుణులైన వైద్యులతో తీవ్ర చికిత్స కొనసాగిస్తున్నాం. రాబోయే 24 గంటల్లో చికిత్సకు ఆయన శరీరం స్పందించే విధానాన్ని బట్టి ఆరోగ్య పరిస్థితిని అంచనా వేయగలం' అని పేర్కొన్నారు.